దీపావళి నెలొచ్చేసింది..
దసరా ఎళ్లిందగ్గర్నించి మా అమ్మమ్మగారి ఊరైన కట్టమూళ్ళో ఏ ఇద్దరు కుర్రోళ్ళు కల్సినా 'సిసింద్రీ ఎన్ని కూరతన్నావ్రా' అనే మొదలయ్యేది డిస్కషను..
కాకర్ల సుబ్బారావు, నిమ్మలపూడి నాగేశ్వరరావు, నలమాటి దొరబ్బాయి గారి శ్రీను, పెండ్యాలోరి సూరన్నయ్య లాంటి పెద్ద తలకాయలంతా కల్సి గ్రూపులాగా తయారయ్యి ఏమేం చెయ్యాలో ఓ మాటనుకునేవారు..
ఏదొక ఆదివారం పొద్దున్నే ఏటవతలకెళ్ళి, స్మశానం దిబ్బలమీద బలంగా ఉన్న తెల్లజిల్లేడు మొక్కల్ని వెతికి కొట్టడంతో మొదలయ్యేది దీపావళి నెల హడావిడి.. ఆ మొక్కని ఎండబెట్టి, భూమిలో గాడిపొయ్యిలాగా తవ్వి అందులో వేసి కాల్చేవారు..
కాల్చగా వొచ్చిన ఆ బొగ్గుని ఊళ్ళో ఉన్న చిన్నపిల్లల్లాంటోళ్లకి తలా కొంతా ఉదారంగా పంచేవారు.. బరువు తక్కువ, డెన్సిటీ ఎక్కువుండే ఈ బొగ్గులో ఏముంటాదని తేలిగ్గా తీసిపారెయ్యకండి.. రాకెట్టుకి హైడ్రోజన్ ఎలాగో, సిసింద్రీకి జిల్లేడు బొగ్గు అలాగన్నమాట..
'సుయ్య్య్'మని దూసుకుపోయే సిసింద్రీకైనా, రయ్యిన పైకెగిరే జువ్వల్నైనా వాటి 'స్పెసిఫిక్ ఇంపల్స్' ని నిర్దేశించేది ఈ తేలికపాటి బొగ్గే మరి..
అక్కడ బొగ్గు తయారవ్వుతూ ఉండగానే, ఇక్కడ సిసింద్రీ గుల్లలు చుట్టుకోవడం మొదలెట్టేసేవారు. అప్పట్లో సోవియట్ రష్యా నించి ఓ మేగజైన్ వొచ్చేది.. మంచి మందంగా ఒకరకమైన నునుపుతో ఉండే ఆ మేగజైన్ పేపర్ని మనోళ్లు 'సోబీ అట్ట' అనేవారు.. కోంటబ్బాయ్ గారి కొట్లో పావలా ఇచ్చి మూడుకాగితాలు కొనుక్కొస్తే పాతిక గుల్లయ్యేది..
మధ్యాహ్నం పూట అన్నాలు తినేశాకా అరుగుగచ్చు మీద కూర్చుని శ్రద్ధగా సన్నని పుల్లముక్కని చివర్న సూదంటుగా చెక్కి దాంతో గులల్లు చుట్టుకునేవారు..
అప్పటి పల్లెటూళ్లలో అరుగుల్లేని ఇళ్ళు, ఇలాంటి పనులు చెయ్యని కుర్రాళ్ళు ఉండటం చాలా అరుదు గనుక ఆ అరుగుల మీదే కూర్చుని గుల్లలు చేసుకోవడమో, లేక మందు కూరడమో మొదలెడితే చుట్టుపక్కలున్న కుర్రోళ్ళు కూడా వొచ్చి తలా చెయ్యి వేసేవారు.. తక్కువ గుల్లయితే అన్నంమెతుకులంటించి పనికానిచ్చేసేవారు.. ఎక్కువ గుల్లయితే మైదాపిండి ఉడకబెట్టి మరీ అంటించేవారు..
ఈ గుల్లల పనయ్యాకా ఇక మందు సంగతి..
ఆరుపాళ్ల జిల్లేడుబొగ్గుకి, కోంటబ్బాయ్ గారి కొట్లోంచి కొనుక్కొచ్చిన రెండుపాళ్లు గంధకం, రెండుపాళ్లు సూరేకారం కలిపి ఎండబెట్టి సిసింద్రీ గుల్లల్లోకి శ్రద్ధగా కూరేసుకునేవారు.. సిసింద్రీలొక్కటే చేసుకుని ఊరుకోకుండా మతాబుల మందుపాళ్లు తెచ్చి కలిపి అక్కచెల్లెళ్ళ కోసం మతాబులు, చిచ్చుబుడ్లు కూరి పెట్టేవారు..
అలా కష్టపడి చేసిన సిసింద్రీల్ని ఎండబెట్టుకుని దీపావళి ఇంకా నాల్రోజులుండగానే బయటకి తెచ్చి, ట్రైలేసి, ఇంటి పక్కనోళ్ళ చీరో, పాకో కాల్చి, పీకల మీదకి తెచ్చుకునేదాకా కుర్రోళ్ళు ఊరుకునేవారు కాదసలు...
కాకర్లోరి సుబ్బారావు 200 గుల్ల చేసేడంటే, పెండ్యాలోరి సూరిబాబు 300 కూరాల్సిందే.. మర్నాటికల్లా 100 సిసింద్రీలు ఎండలో పెట్టాల్సిందే.. అన్నీ రికార్డులే..
అయ్యన్నీ గొప్ప సరదాగా ఉండేయిలెండి..
పిలల్లేసుకునే సిసింద్రీలే కాకుండా 'సీనియర్స్' విభాగానికి చెందిన ఇంకో రెండు బాణసంచాలుండేవి..
పేకల్ని రౌండుగా చుట్టి చివర్లో యూరియా సంచుల్తో పాటోచ్చే పేకదారంతో కొబ్బరి ఈనెలకి కట్టే జువ్వలు మొదటిరకం అయితే,
చాలామందికి తెలీని/మర్చిపోయిన దేశవాళీ బాణసంచా 'ఉప్పొట్లం' అనేది రెండోరకం..
తాడిచెట్టు మొవ్వుపైన వొచ్చే గిలకని తెచ్చి, కాల్చి, ఉప్పుతో కలిపి గుడ్డకి పేడ రాసి పెద్ద పొట్లంలాగా చేసి అందులో సిసింద్రీ మందు కూరి, ఓ తాడు కడతారు..
ఆ పొట్లాన్ని వెలిగించి, తాడు పట్టుకుని తిప్పుతూ ఉంటే.. తస్సదియ్యా..
ఆ చీకట్లో ఉప్పు చిటపటలాడుతూ, మొవ్వు కాలుతూ, వెయ్యి మిణుగురుపురుగులు మనచుట్టూ తిరుగుతున్నట్టే ఉండేది.. మందు కొంచెమే కానీ, గంటసేపు కాలేది ఒక్కో ఉప్పట్లం.. ఇలాంటి రెండు ఉప్పొట్లాలు చేస్తే దీపావళి మొత్తం సరిపోయేయి..
దీపావళికి జువ్వలేసి మీసాలుమెలేసినోడు ఊరికి మొనగాడయితే,
ఉప్పొట్లం కాల్చి కాలరెగరేసినోడు ఆ ఏరియాకే వీరుడన్నట్టు లెక్క..
నాగులచవితి వొచ్చేదాక ఊళ్ళో వాళ్లే గొప్ప.. (చవితి గురించి నెక్స్ట్ పోస్టులో)
ఇవన్నీ గొప్ప సరదాల్లెండి అప్పుడు..
ఇంత ఆనందం పొందడానికి అక్కడ మనీ మేటరే కాదండీ అసలు.. మహా అయితే అర్ధరూపాయ్ పెడితే తులం సిసింద్రీ మందొచ్చేసేది.. (తులం అంటే పాతరూపాయి కాసంత బరువు తూగుతుంది). మిగతా అంతా ప్రకృతే ఇచ్చేది.. పిల్లల్లో క్రియేటివిటీని బయటకి తీసేది..
జిల్లేడుమొక్కని వెతికి పట్టుకోడానికి ఏ బొటనీలు చదవలేదు..
సిసింద్రీ మందుని సరైన నిష్పత్తిలో కలపడానికి ఏ 'స్పెసిఫిక్ ఇంపల్స్' కాలిక్యులేషన్లు వెయ్యలేదు..
జిల్లేడుబొగ్గు లాంటి ఎగ్జార్బిటెంట్ మెటీరియల్ని నలుగురికీ పంచే నాయకత్వ లక్షణం ఎవరూ ఎవరికీ నేర్పలేదు..
అన్నీ ప్రకృతే ఇచ్చింది, నేర్పింది..
ఇదంతా ఎవరికీ హాని చెయ్యని రీతిలో పిల్లలంతా చేసుకున్న కుటీర పరిశ్రమే అనుకోండి, పరస్పర సహకారమే అనుకోండి.. అందరూ కల్సి చేసుకోడంలో సరదా ఉండేది.. అదంతా బుజ్జి బుర్రల్లోంచొచ్చిన క్రియేటివిటీ.. చిట్టి చేతులు పడ్డ తేలికైన కష్టం.. అందుకే ఈ పండగంటే పిల్లలకి అంతిష్టం..
ఒక్కపూట కాల్చుకునే టపాసుల వల్ల లోకం మొత్తం పాడైపోద్దనే లాంటి పాడు చట్టాలేమీ అప్పటికింకా లేవు కాబట్టే చిన్నప్పుడు చేస్కున్న దీపావళంటే ఇప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం..
నిన్న మా గోవిందుబావ ఫోన్ జేస్తే మాటలమధ్యలో ఉత్సాహంగా అడిగా.. 'కట్టమూళ్ళో ఇంకా ఆ సిసింద్రీలు అవి చేస్తున్నారా బావా' అని..
.
.
.
.
'ఇప్పుడెవరున్నర్రా అలా.. అవన్నీ మనతోనే ఎండ్ అయిపోయాయి.. అంత హడావిడేమీ లేదిప్పుడు' అన్నాడు..!
.
.
ఎక్కడో చివుక్కుమంది..
.
.
నిజమేనేమో..
.
.
ఇప్పుడు దీపావళి శుభాకాంక్షలు అందరికీ ఫార్వార్డ్ చేసి, టీవీలో వొచ్చే జబర్దస్త్ ఆర్టిస్టుల 'స్పెషల్ షో'లకి తరించిపోయి, సాయంత్రమయ్యాకా లైటింగ్ పెట్టి, ప్రెస్టీజ్ కోసం బయట్నించి కొనుక్కొచ్చిన క్రాకర్స్ కాల్చడానికి అలవాటుపడిపోయాం కదా..
ఓ సామాన్యుడు/ ఓ సామాన్యురాలు
=====సేకరణ=====
=====సేకరణ=====
No comments:
Post a Comment