Good Stories To Read

మంచి కథ  1................

రిటైర్మెంటు రోజు ఆఫీసులో భారీగా ఏర్పాట్లు చేశారు.  పెద్ద అధికారులు, యూనియన్ నాయకులు సత్కారసభకి వచ్చి సుందరయ్య సేవలను కొనియాడారు.  చివర్లో సుందరయ్యపిల్లలు మాట్లాడుతూ సుందరయ్య సంతానంగా తాము జన్మించటం తమ అదృష్టం అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు.తన పిల్లలు ఇంత బాగా మాట్లాడుతారా అని సుందరయ్యే ఆశ్చర్యపోయాడు. 

తనకి జరిగిన సత్కారానికి  కృతఙ్ఞతలు తెలుపుతూ సుందరయ్య “తనకి ఇంత భారీగా సత్కార సభ జరగటం వ్యక్తిగతంగా ఇష్టం లేకపొయినా సరే, పది మందికోసం ఒప్పుకోక తప్పలే దంటు” తన అనుభావాలను ముచ్చటించి కష్టపడి పనిచేసి సంస్ధ అభివృద్ధికి పాటుపడాలనీ, సంస్థ బాగుంటేనే మనం బాగుంటామని హితవు పలికాడు. చివర్లో తనకి రావలసిన పి.ఎఫ్., గ్రాట్యుయిటి, వగైరా  అన్నింటికీ సంబంధించిన చెక్కులు సుందరయ్య చేతికి అందించారు.  సభ ముగిసిన తర్వాత అక్కడే విందు ఏర్పాటు జరిగింది.  కార్యక్రమాలైన తర్వాత కార్లో ఇంటికి సాగనంపారు.  రాత్రి ఇంటికి చేరిన తర్వాత పిల్లలు ఆఫీసులో జరిగిన సన్మానం గురించి మాట్లాడుకుంటుండగానే  సుందరయ్యకి వెంటనే నిద్ర పట్టేసింది.

మర్నాడు బ్యాంకుకి వెళ్ళి తన అకౌంట్లు  అన్నీ సెటిల్ చేసుకున్నాడు.  మిగిలిన డబ్బుని అకౌంటులో వేసుకుని, పిల్లల విషయం తేలిన తర్వాత ఏంచెయ్యాలో అప్పుడు అలోచించొచ్చని ఇంటికి తిరిగొచ్చాడు.  అలాగే, తానే పిల్లల్ని పిలిచి ఉన్న విషయాన్ని చెప్పి ఓ నిర్ణయానికి రావటం మంచిదని భావించాడు. 

అటు సుందరయ్య కొడుకూ, కూతురు కూడా తండ్రితో విషయం ఎలా చెప్పాలా? అని ఆలోచిస్తున్నారు. అందరి పిల్లల్లాగే వాళ్ళకీ తండ్రి దగ్గర భయం ఎక్కువే. ఒకొక్కసారి తండ్రి తీసుకునే నిర్ణయాలను మార్చడం కష్టం. కొన్ని సందర్భాల్లో ఆయన గీసుకున్న గిరిని దాటి వచ్చేవారుకాదు. ఆ విషయంలో మాట్లాడటానికి కూడా అవకాశం ఇచ్చేవారుకాదు. తండ్రి సిద్ధాంతలు చాలా ఉన్నతమైనవే.. కాని ఈ రోజుల్లో వాటిని నిత్యజీవితంలో పాటించడం కష్టం.  అందుకే పట్టువిడుపులు ఉండాలి. రోజులతోపాటూ మనం కూడా మారాలి.   అంతేకానీ సమాజాన్ని మార్చటం మన తరంకాదు.. అని తండ్రికి చెప్పే ధైర్యం వాళ్ళకి లేదు. అలా అని అయన అభిప్రాయాలు మంచివి కావని కూడా అనలేరు.

 ఎవరు ఏమడుగుతారనే టెన్షన్ తోనే ఆ రోజు పూర్తిగా గడిచిపోయింది. 
"వాళ్ళు ఏమైనా నీతో అన్నారా?" అంటూ రాత్రి పడుకోబోయేముందు సుందరయ్య భార్యని అడిగాడు.
"అబ్బే.. నన్నేం అడగలేదు.  ఆడిగినా నేనేం మాట్లడతాను?  ఆ విషయం వాళ్ళకి తెలుసు."

ఆ మర్నాడు సాయంత్రం పిల్లలు వెళ్ళిపోతారు.   ఈలోగా ఏదో ఒకటి తానే చెయ్యాలి. సుందరయ్య ఏదో ఆలోచన స్ఫురించటంతో నిద్ర పట్టేసింది.  ఉదయమే ఇంట్లో అందరిని పిలిచాడు సుందరయ్య.

"నేను,  అమ్మ ప్రస్తుతానికి ఇక్కడే ఉంటాం.  పుట్టి పెరిగిన ఊరు వదలి రావాటం కుదరదు. నాకు పెన్షన్ వస్తుంది. అది మాకు సరిపోతుంది.    నా రిటైర్మెంటు  డబ్బులతో అప్పులు తీర్చగా మిగిలినవి మొత్తం  ఇవి! మాకు ఏమైనా అవంతరాలు వస్తే అవసరార్థం కొంచెం డబ్బులు మాకు వుంచి  మిగతావి మీరిద్దరు తీసుకోండి.  ఇదిగో  బ్లాంక్ చెక్కులు. నేనివ్వగలిగింది ఇదే!" అంటూ సుందరయ్య ఓ కాగితం మీద లెక్కలు రాసి, చెక్కులు  వాళ్ళ చేతిలో  పెట్టాడు.

వసంతమ్మకి భర్త అలోచన నచ్చింది.  నిజమే..అంత్య నిష్టూరం కంటే ఆదినిష్టూరం మంచిది. అయితే  ఆయన మాటలు మిగాతావాళ్ళకి ఆశ్చర్యం కలిగించలేదు. అయన ఏ విషయమైన, అంతా సూటిగానే చెప్పేస్తారు .
"వద్దు నాన్నా.   మేం వచ్చింది మీ రిటైర్మెంటు సమయంలో మీతో నాలుగు రోజులు గడపడానికి వచ్చామే గానీ ఆస్తులు పంచుకోడానికి కాదు!! మాకు ఆర్ధిక సమస్యలు గానీ, అవసరాలు గానీ లేవు. నిజంగా మాకు అవసరమైతే మీ దగ్గర తీసుకోడానికి మాకు మొహమాటం ఎందుకుంటుంది నాన్న గారూ! ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా ఉండండి" అంటూ అబ్బాయి చెక్కుల్ని తిరిగి  తండ్రి చేతితో పెట్టేశాడు. 

అంతే! ఒక్క నిమిషంలో వాతవరణం చల్లబడిపోయింది.  అందరి ఉహాలు ఓరకంగా ఊహలుగానే ఉండిపోయాయి .
"అన్నట్లు.. నాన్నగారు మనందరం కలిసి ఓసారి మన కోనేరుగట్టుకి వెళ్ళొద్దాం.  మన పాతిల్లు, ఆ వీధి చూసి చాలా కాలమయింది" అన్న కొడుకు మాటలు వినేసరికి సుందరయ్యకి ఆనందం వేసింది. 

"నిజమేరా! మేం కుడా ఆ గట్టుకి వెళ్లి చాలా కాలమయింది " అంటూ అందరు బయలుదేరారు.
"అబ్బా! మన వీధి చాలా మారిపోయింది ."
"అవున్రా. ఈ  వీధిలో అందరి ఇళ్ళు అపార్టుమెంట్సుకి ఇచ్చేసారు.  ఒక్క మనం అద్దెకున్న వాళ్ళ ఆ ఇల్లే అలాఉంది. ఈ మధ్య  ఆ ఇంటివాళ్ళు అమ్మెస్తే, ఎవరో కొనుక్కొని రీమోడల్ చేయించారట. మొక్కలు, చెట్లు పాడావకుండా అలాగే వున్నాయి! ఎవరో మంచి వాళ్ళలా ఉన్నారు! ఇంటి స్వరూపాన్ని పాడుచేయకుండా, బాగుచేయించారు. బావుంది!" అలా కబుర్లు చెప్పుకుంటూ కోనేరు నాలుగు గట్లూ తిరిగి, ఇంటికొచ్చేసారు. 

ఆ రోజు సాయంత్రమే పిల్లల ప్రయాణాలు. 
‘ఏవిటో! వారం రోజులు ఏడు క్షణాల్లా గడిచిపోయాయి!’ అనుకుంటూ వాళ్ళతోపాటు రైల్వే స్టేషన్ కు వెళ్లి , వీడ్కోలు చెప్పి ఇంటికొచ్చేశారు సుందరయ్య, వసంతమ్మ.   ఇంటిికొస్తూనే టేబులుమీద కవరు చూసి సుందరయ్య అశ్చర్యపోయాడు. నాన్నగారికి  అన్న అక్షరాలు చూసి ఆత్రుతగా కవరు చింపి చదవసాగారు.

నాన్నగారికి,
మీ దగ్గర మాట్లాడే ధైర్యం లేక  ఈ ఉత్తరం రాస్తున్నా౦.  మరోలా భావించకండి.   మీరు పడ్డ కష్టాలు మేం పడకూడదని, మమ్మల్ని చాలా అపురూపంగా పెంచారు! దానికితోడు మారిన రోజులతోపాటు మేం కూడా మారిపోయాం. యాంత్రికయుగంలో ఎన్నో సదుపాయాలను ఏర్పాటు చేసుకుని జీవితాన్ని చాలా సుఖమయం చేసుకున్నాం.  కాలంతోపాటు పరుగులు తీస్తున్నాం! కానీ మేం చాలా కోల్పోయాం నాన్నగారుా!! బాల్యం మాకు తెలియదు. యవ్వనంలో మాకు మంచి అనుభూతులు లేవు. అనుబంధాలు, ఆత్మీయతలు అంటే మాకర్ధం తెలియదు. మేం పరిగెత్తుకుంటూ పాలు తాగుతున్నాం,  కానీ నీళ్ల రుచి తెలియదు!  మీ తరంవాళ్ళు గుర్రంస్వారీ చేసేవారు.  మేం పులిస్వారీ చేస్తున్నాం.  మీరు జీవితాన్ని కాచివడపోసారు. మేం జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం.  మీరు పెద్దలమాటలు వినేవారు. మేం కంప్యూటర్ చెప్పినట్లు నడుచుకుంటున్నాం!! అమ్మ ఎప్పుడూ  అంటుందే.. అలా మేం గోరీలు కట్టుకుని జీవిస్తున్నాం నాన్నగారుా!! 

ఒక్క విషయం చెప్పగలంనాన్నగారు! మీ పెంపకంలో లోపం లేదు.  మేం పెరిగిన వాతవరణంలో లోపం ఉంది!  మా దగ్గర సముద్రమంత మేధస్సు ఉంది. కానీ ఆ మేధస్సుతో  గుక్కెడు నీళ్ళు కూడా తాగలేం! మీ మేధస్సు కోనేరంతే .. అయితే నేం .. అదంతా మంచినీరు!!.  ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మిమ్మల్ని ఈ రొంపిలోకి లాగదలచుకోలేదు! మీరు ఎప్పుడూ స్వప్నాలలో జీవించలేదు.వాస్తవాలతో జీవనం సాగించేరు! మీకు మనుషులతోనేకాదు, మీ పుట్టి పెరిగిన నేలతో కూడా బంధాలున్నాయి. చెట్లూ, పశువులూ,పక్షులూ అన్నిటితో మీకు అనుబంధాలున్నాయి! వీటితోపాటు చివరికి మనం పాతికేళ్ళు అద్దెకున్న ఇంటిమీద కూడా  మీకు మమకారం ఉంది!! వీటిని వదులుకోలేక, ఉద్యోగంలో ప్రమోషన్లు తీసుకోకుండా ఉన్నదాంట్లో చాలా సంతృప్తిగా జీవిస్తున్నారు!

అందుకే  మమ్మల్ని  మీవాస్తవ జీవితాల్నుంచి దూరం చేయటం ఇష్టంలేక, మీ అనుభందాలను త్రుంచటం ఇష్టం లేక, మీకు తెలియకుండా  ఓపని చెశాం!!  అక్కా, నేను కలసి మన కోనేరు గట్టులో మన గతంలో ఉన్న ఇంటిని మీ గురించి కొన్నాం. ఈ ఉత్తరంతో పాటున్న  తాళంచెవి  ఆఇంటిదే!! మీరు ఆఇంటిలోకి మారి, స్వేచ్ఛగా, హాయిగా  ఉండాలనేదే  మాకోరిక!  

అన్నట్లు, ఇంకో అభ్యర్ధన కూడా ఉంది నాన్నా!! త్వరలో మాకు పుట్టే పిల్లల్ని మమ్మల్ని పెంచినట్లు కాకుండా,  మీరు పెరిగినట్లు పెంచి,  పెద్దచేసే బాధ్యతని మీకే అప్పగిస్తున్నాం. మన గట్టు మీద పెంచండి. అంటే మాకు  తీరిక లేక, పెంచలేక  కానేకాదు!!  మా స్వార్థం అంతకంటే కాదు!!  వాళ్ళు మేం పెరిగినట్లు పెరగకూడదు. మీరు పెరిగినట్లు పెరగాలనే మా ఆశ! వాళ్ళు యంత్రాలు కాకూడదు, వాళ్ళు మనుషులలాగానే ఎదగాలి!  
ఓ విషయం చెప్పనా నాన్నా?  మీలాంటి వాళ్ళ చేతులలో పిల్లలు పెరగడం, భవిష్యత్తులో మనిషి మనుగడకి చాలా అవసరం నాన్నా! కాదనరుగా!!
ఇట్లు
మీ అమ్మాయి, అబ్బాయి.

ఉత్తరం చదివిన సుందరయ్య కళ్ళు  కోనేరుతో నిండిపోయింది!  ఆ కళ్ళతోనే వసంతమ్మ  కళ్ళల్లో వసంతాన్ని చూశాడు. వంటింట్లో కాకులు, పెరట్లో కోయిలలు హడావిడిగా కనిపించేయి.
అయ్యకోనేరు మాత్రం ఆనందబాష్పాలు రాల్చింది!!

కొత్త కొత్త సానుకూల ఆలోచనలని రేకెత్తించే  ఇలాంటి కథలే ఇప్పుడు మనుషులని నిజమైన మనుషులుగా మార్చటానికి పనికొస్తాయి!

సూపర్ స్టోరీనే కదా?...........మరి మీకు నచ్చితే మీ మిత్రులకు పంపిస్తారు కదూ!!!


------------------------------------------------------------------------------------------------------------

మంచి కథ  2................


*హృదయాన్ని తాకిన ఓ చక్కని కథ తప్పక మీ అందరితో పంచుకోవాలని అనిపిస్తోంది!*


విశాఖపట్నంకి చెందిన మునుస్వామి వ్యాపార వేత్త, వ్యాపారంలో బాగా సంపాదించి స్థిరపడిన పెద్దమనిషి. సంపాదించిన ఆస్తిలో కొంతభాగంతో  వారు విశాఖపట్నం శివారు పల్లెటూరులో కొంతభూమిని కొని, అక్కడ ఒక 3అంతస్తుల ఫామ్ హౌస్ ని కట్టుకున్నారు. ఆ ఫామ్ హౌస్ దొడ్డి వైపు  ఒక చక్కని స్విమ్మింగ్ పూల్, గార్డెన్ కూడా ఏర్పటుచేసుకున్నారు. వాటితో పాటూ అక్కడ ఒక పెద్ద ఆహ్లాదపరిచే 100ఏళ్ళ నాటి మామిడి చెట్టు కూడా ఉంది. నిజానికి ఆయన ఆ ఆస్తి కొన్నది కూడా ముఖ్యంగా ఆ పెద్ద మామిడిచెట్టును చూసి ముచ్చటపడే, ఎందుకంటే వారి భార్యకు మామిడిపళ్ళు అంటే చెప్పలేనంత ఇష్టం. 


ఆ కొత్త ఇంటికి పనులు చేయిస్తున్న సమయంలో స్వామిగారి శ్రేయోభిలాషులు కొందరు, వాస్తు చూపించుకుని ఇంటికి తగినమార్పులు చేయించుకోమని వారికి గట్టిగా సలహా ఇచ్చారు. అయితే వాస్తుపై పెద్దగా నమ్మకంలేని వ్యక్తి మునుస్వామి గారు. అయితే ఈసారి  ఆశ్చర్యకరంగా వారి ఆత్మప్రభోదం మేరకు వారు ఒక వాస్తు పండితుని సలహా కొరకు ఆరా తీసి హైదరాబాద్ నుండీ ఒక గొప్ప వాస్తు విద్వాన్ ని పిలిపించారు. ఆ వాస్తు పండితులు ఎవరోకాదు  పేరుమోసిన గొప్ప వాస్తు శాస్త్రవేత్త. వాస్తుపై  30ఏళ్లకు మించిన వృత్తిపరమైన గొప్ప అనుభవజ్ఞులు శ్రీవీరారెడ్డిగారు.


వారు వైజాగ్ వచ్చాకా భోజనానంతరం మునుస్వామిగారి సొంత డ్రైవింగ్ లో   ఇద్దరూ వైజాగ్ శివారు బయలుదేరారు.

కొంతప్రయాణం తర్వాత వారు వెళ్తున్న దారిలో మునుస్వామిగారు కారును కొద్దిగా పక్కకు పోనిచ్చి, వెనుకగా ఓవర్ టేక్ చేసి వస్తున్న కొన్ని కార్లకు దారి ఇవ్వడం చూసిన రెడ్డి గారు  చిరునవ్వుతో స్వామి గారూ!  
మీ డ్రైవింగ్ నిజంగా చాలా సురక్షితమైనది అన్నారు.
దానికి స్వామిగారు నవ్వుతూ అయ్యా! వారికి ఎదో అత్యవసరపని అయిఉండొచ్చు, అందుకే తొందరలో వెళ్తున్నారు.అలాంటి వారికి ముందుకు వెళ్ళడానికి మనం దారిఇవ్వడం మన ధర్మం కదండీ! అన్నారు.


        అక్కడనుండి కారు విజయనగరం అనే చిన్న పల్లెటూరు సమీపించింది. అక్కడి వీధులు చిన్నగా ఇరుకుగా ఉండడంతో స్వామిగారు కారు వేగం తగ్గించి నెమ్మదిగా నడుపుతున్నారు.  ఇంతలో హఠాత్తుగా ఒక కొంటె కుర్రాడు రోడ్డుకు అడ్డంగా ఒక్కసారిగా పరిగెత్తాడు. గమనించిన స్వామిగారు అతడిని తప్పించి తన కారును మరింత  నెమ్మదిగా పోనిస్తున్నారు.

అది ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. ఇంతలో అదే దారిలో మరో కుర్రాడు కూడా అలాగే హఠాత్తుగా పరిగెత్తుతూ ముందుకు వెళ్ళిపోయాడు


ఈసారి ఆశ్చర్యపోవడం రెడ్డిగారు వంతైంది. ఆయన సార్! ఇలా ఇంకో పిల్లాడు మరలా వస్తాడను మీరెలా ఊహించారు అని ప్రశ్నించారు.

స్వామిగారు నవ్వుతూ...
పిల్లలెప్పుడూ అంతేకదండి!
ఒకడి వెంట మరొకడు వెంటపడుతూ ఆడుకుంటారు. వెనుక ఇంకొకడు లేకుండా ఒక్కడే ఎప్పుడూ అలా ఆడుకోరు కదా? అన్నారు.


ఆ మాట విన్న రెడ్డిగారు ఆనందంగా బ్రోటనవేలు పైకెత్తి చూపిస్తూ మీరు దాన్ని  ఊహించి నడపడం  నిజానికి మీ గొప్పదనం అని స్వామిగార్ని అభినందించారు.


కారు ఫామ్ హౌస్ కి చేరుకుంది. కారులోంచి వారు క్రిందికి దిగుతుండగా, అక్కడ ఒక్కసారిగా 7,8 పక్షులు రెక్కలు కొట్టుకుంటూ  పైకి ఒక్కసారిగా ఎగిరాయి, అది చూసిన స్వామీ గారు, రెడ్డిగారిని ఆపి, సర్ మీరు ఏమీ అనుకోకపోతే, మనం కొద్ధి సేపు ఇక్కడే  ఆగి వెళదాం!ఏమంటారు?


రెడ్డిగారు: ఏమండీ ఎందుకు?
స్వామిగారు నవ్వుతూ... అక్కడ దొడ్డివైపు ఎవరో కొంతమంది పిల్లలు చెట్టెక్కి మామిడిపళ్ళు కొస్తున్నట్లు ఉంది, మనం కనుక హఠాత్తుగా వెళ్తే వాళ్ళు మనల్ని చూసి భయపడి చెట్టునుండి దూకితే క్రిందపడిపోతారు.
ఎందుకండీ అనవసరంగా
అంతలా వాళ్ళని భయపెట్టి సాధించేదేముంది అన్నారు.



వీరారెడ్డి గారు కొంతసేపు స్తబ్దుగా ఉండిపోయారు. ఆపై నెమ్మదిగా ఇలా అన్నారు.
ఈ ఇంటికి ఎటువంటి వాస్తు మార్పులు చేర్పులు అవసరం లేదు !
ఈసారి ఆశ్చర్యపోవడం స్వామిగారి వంతైంది...
ఎం?ఎందుకండి?



రెడ్డిగారు: ఏ ప్రదేశం అయినా, మీలాంటి ఉత్తములు నివసిస్తూ ఉంటే, సహజంగానే అది ఉత్తమమైన వాస్తుగానే దానంతట అదే మార్పు చెందుతుంది, సందేహం లేదు.


*ఎప్పుడైతే మన ఆలోచనలు, ఆకాంక్ష ఇతరుల శ్రేయస్సు, సంక్షేమం కోరుకుంటాయో, ఆఫలితం లబ్దిపొందే వారికే కాక, అది మనకి  కూడా మంచి చేస్తుంది.*

అయితే ప్రత్యేకించి *ఎల్లప్పుడూ అన్నిసమయాల్లోనూ ఇతరుల సంక్షేమం కాంక్షించే వ్యక్తి వారికి తెలియకుండానే మహోన్నతుడు, సత్పురుషుడుగా మరిపోతాడు.* నిజానికి సాధువు,సత్పురుషుడు అంటే  ఎల్లప్పుడూ సమాజానికి మేలు చేసే వ్యక్తులే కదా!

ఇదీ ఓగొప్ప వాస్తువిద్వాన్  వారి అభిప్రాయం.

మీ అందరికీ కూడా ఇకపై మీ ఇంటికి  వాస్తు పండితుని అవసరం రాకూడదని ఆశిస్తున్నా!

💐💐💐💐



మంచి కథ  3................


మీ అమ్మ మారిపోయిందమ్మా!

(శ్రీమతి గన్నవరపు సరోజినీ సత్యనారాయణమూర్తిగారి స్మారక కథలపోటీలో మొదటి బహుమతి గెల్చుకున్న కథ )

మీ అమ్మ మారిపోయిందమ్మా!

   “మీ అమ్మ మారిపోయిందమ్మా..”అన్న నాన్నగారి మాటే నా చెవుల్లో గింగుర్లెత్తుతోంది. ఈ మాట ఆయన నాలుగునెలలక్రితం ఫోన్ లో అన్నారు. “అమ్మ మారడమేంటి నాన్నా!” అనడిగితే “ఏమోనమ్మా! నాకలా అనిపిస్తోంది..” అని అక్కడితో ఆపేసారు. మళ్ళీ నెల్లాళ్ళ తర్వాత అదే మాట. “ఏం జరిగింది నాన్నా!” అంటే “ఇదివరకులా లేదమ్మా.. ఇదివరకు అస్సలు యిల్లు కదిలేది కాదా! ఇప్పుడు అస్తమానం ఎక్కడికో అక్కడకి వెడుతోంది.” అన్న నాన్నగారి మాటలకి హోస్.. అంతేనా అనిపించింది. “పోనీ, వెళ్ళనీ నాన్నా.. ఇప్పటికి కదా అమ్మకి కాస్త వెసులుబాటయిందీ..ఇన్నాళ్ళూ యిల్లు పట్టుకునే వుంది కదా..!” అని తేలిగ్గా తేల్చేసాను. అప్పటికి వూరుకున్నారు నాన్న. మొన్న మళ్ళీ ఫోన్ చేసినప్పుడు “ఏవిటోనమ్మా! మీ అమ్మ యిదివరకులా లేదు. ఎప్పుడూ లేనిది డబ్బు లెక్కలు కూడా అడుగుతోంది.” అన్నారు. ఈ మాటకి కాస్త ఆశ్చర్యం వేసింది నాకు. ఎందుకంటే అమ్మ డబ్బు విషయం యెప్పుడూ పట్టించుకునేది కాదు. ఆ విషయాలన్నీ నాన్నగారే చూసుకునేవారు. అమ్మకి యెంతసేపూ యిల్లే కైలాసం, పతియే ప్రత్యక్ష్యదైవం అనే ధోరణిలో వుండేది. నాన్నగారికి యిబ్బందవుతుందని యేవైనా పెళ్ళిళ్ళుంటే తప్పితే పుట్టింటికి కూడా యెక్కువ వెళ్ళేది కాదు. అలాంటి అమ్మ డబ్బులెక్కలు అడుగుతోందంటే కాస్త వింతగానే అనిపించింది.

   ఈ సంగతేమిటో తెలియాలంటే ఒకసారి రాజమండ్రీ వెళ్ళాల్సిందే అనుకున్నాను. అమ్మానాన్నల్ని చూసి వచ్చి కూడా అప్పుడే ఆర్నెల్లయిందని గుర్తు చేసుకుంటూ పనికట్టుకుని హైద్రాబాదునుంచి రాజమండ్రీ వచ్చాను. రైలు దిగి ఇంటికి వెడుతున్నంతసేపూ దారి పొడుగునా కనిపిస్తున్న చిన్నప్పటి జ్ఞాపకాలను మించిపోయాయి మా నాన్నగారు అమ్మని గురించి ఫోన్‍లో చెప్పిన మాటలు.

  గేట్లోకి అడుగు పెట్టగానే ఇంటిముందు చుక్కలతో పెట్టిన మెలికలముగ్గు ముద్దుగా స్వాగతం చెప్పింది. అటువంటి మెలికలముగ్గు ఎన్నిసార్లో అమ్మ దగ్గర నేర్చుకుందామని ప్రయత్నించి విఫలురాలినయ్యాను. ముచ్చటగా ముగ్గును చూస్తూ ఇంటి వరండాలో అడుగు పెట్టిన నాకు నాన్నగారికి కాఫీ అందిస్తున్న అమ్మ కనిపించింది. నన్ను చూడగానే ఇంతమొహం చేసుకుని, “రా రా..ఒక్కదానివే వచ్చావా? పిల్లలు రాలేదా?”  అంటూ అక్కున జేర్చుకుంది. అదేమిటో అమ్మ దగ్గరికి రాగానే చిన్నపిల్లనయిపోయినట్టనిపిస్తుంది. “నీ కాఫీకోసం వచ్చానమ్మా..” అన్నాను నవ్వుతూ. “రా అమ్మా.. రా..” అన్న నాన్నగారి పిలుపు విని అటు నడిచాను. పక్క కుర్చీ చూపిస్తూ, “పిల్లలూ, అతనూ బాగున్నారామ్మా?” అనడిగారు. మేమిద్దరం క్షేమసమాచారాలు చెప్పుకుంటూనే వున్నాం అమ్మ కమ్మటి కాఫీ అందించింది చేతికి.

 అదేమిటో పుట్టింటికి వెళ్ళగానే యెక్కడలేని బధ్ధకం వచ్చేస్తుందేమో టైమ్ యెనిమిదవుతున్నా నాన్నగారూ, నేనూ అలా కబుర్లు చెప్పుకుంటూ అక్కడే కూర్చున్నాం. ఇంతలో అక్కడికి అమ్మ వచ్చింది. చూసి ఆశ్చర్యపోయాను. ఎప్పుడు స్నానం, పూజా చేసుకుందో, యెప్పుడు వంట చేసిందో, యెప్పుడు తయారయిందో తెలీదు కానీ శుభ్రమైన ఇస్త్రీచీర కట్టుకుని, చేతిలో ఒక చిన్న సంచీలాంటిది పట్టుకుని చెప్పులు వేసుకుంటూ మాతో అంది. “వంటంతా చేసి టేబుల్‍మీద పెట్టేనమ్మా. నువ్వూ, మీ నాన్నగారూ కబుర్లయాక స్నానం చేసి, భోంచెయ్యండి. నాకు చిన్న పనుంది. వెళ్ళొస్తాను..” అంటూ జవాబు కోసమైనా చూడకుండా వెళ్ళిపోయింది.

    నాన్నగారి మొహం చిన్నబోయినట్తైపోయింది. “చూసేవామ్మా.. ఇదిగో, ఇదీ వరస. రోజూ యెక్కడికోక్కడికి వెడుతుంది. మళ్ళీ మూడుగంటలు దాటితేకానీ రాదు. అంత మొగుడికి అన్నంకూడా పెట్టకుండా చేసే రాచకార్యాలేంటో మరి?” కాస్త బాధగానూ, మరికాస్త నిష్ఠూరంగానూ అన్న నాన్నగారి మాటలకి ఓదార్పుగా అన్నట్టు ఆయన చేతిమీద చెయ్యివేసి, “నేను కనుక్కుంటానుగా నాన్నా..” అన్నాను. “అదేనమ్మా. అందుకే నీకు ఫోన్ చేసేను..” అన్నారాయన.

  నేనక్కడున్న నాలుగురోజులూ అమ్మని బాగా గమనించాను. నిజమే. అమ్మ యిదివరకులా లేదు. యేదో తేడా కనిపించింది. తేడా అంటే ఆరోగ్యం విషయం కాదు. అలాంటి సమస్యలేవీ వున్నట్లు లేవు. కానీ యిదివరకులా ప్రతి చిన్న విషయం నాన్నని అడగడం, యెక్కడికైనా వెళ్ళాలంటే నాన్నగారి భోజన సమయాలూ అవీ కాకుండా చూసుకోవడం లాంటివేమీ లేవు. ఆఖరికి నాన్నగారిని మంచినీళ్ళు కూడా ముంచుకోనివ్వని అమ్మ గబగబా యేదో వండి అక్కడ పడేసి బైటకి వెళ్ళిపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అదేమిటో అమ్మని అడగాలని ఈ నాలుగురోజుల్లోనూ ప్రయత్నించాను కానీ అడగలేకపోయాను. యేమని అడగగలను? సంసారం యెంత గుట్టుగా నడుపుకోవాలో నాకు చెప్పిన అమ్మని, భర్త మర్యాద నలుగురిలో యెలా కాపాడాలో పాఠాలు చెప్పిన అమ్మని, పిల్లలని యెంత బాధ్యతగా పెంచాలో ఉదాహరణలతో సహా చెప్పిన అమ్మని “నాన్నని ఒక్కరినీ అలా వదిలేసి బైటకి యెందుకు వెడుతున్నావమ్మా..”అని యేమని అడగగలను? అడగాలనుకున్నది అడగకుండానే హైద్రాబాదు తిరుగుప్రయాణం అవ్వాల్సొచ్చింది.

  ఆటోలో స్టేషన్‍కి వెడుతున్న నేను టక్కున తలకి తగిలిన దెబ్బకి అమ్మానాన్నల గురించి ఆలోచనల్లోంచి ఒక్కసారి ఈ లోకంలో కొచ్చాను. ఆటో సడన్‍బ్రేక్ వెయ్యడంతో తల ఆటో ముందురాడ్‍కి కొట్టుకుంది. “అమ్మా..” అంటూ నుదురు తడుముకున్నాను. ఆటోవాలా రాంగ్‍రూట్‍లో వచ్చిన స్కూటర్‍వాడిని తిట్టుకుంటూ మళ్ళీ ఆటో స్టార్ట్ చేసాడు. ఇంకా స్టేషన్ ఎంతదూరమా అనుకునేలోపే స్టేషన్‍లో ఆపేడు ఆటోని. బాగ్ చేతిలోకి తీసుకుని, ఆటోకి డబ్బిచ్చి ప్లాట్‍ఫామ్ మీదకి వచ్చేటప్పటికి గౌతమి అప్పటికే ఆగి వుంది. పరుగెడుతున్నట్టే ఎస్8 బోగీ వెతుక్కుంటూ వెళ్ళి, బోగీకి అతికించిన ఛార్ట్ లో నా పేరు, బెర్త్‍నంబరూ చూసుకుని, లోపలకెళ్ళి బెర్త్ మీద బేగ్ పెట్టి కూర్చుని, “హమ్మయ్య..” అనుకున్నాను. కిటికీకి ఆనుకుని కూర్చున్న నాకు మళ్ళీ అమ్మానాన్నల గురించిన  ఆలోచనలు మొదలయ్యాయి.

   నాన్నగారన్న మాట నిజమే. అమ్మ యిదివరకులేని పనులు చాలా కల్పించుకుంది. వారంలో రెండురోజులు నాలుగు వీధులవతలవున్న స్కూల్‍కి వెళ్ళి, అందులో పిల్లలకి కథలు చదివి విన్పించి వస్తుంది. మరో రెండ్రోజులు కాస్త దూరంలో వున్న అదేదో సంఘానికి వెళ్ళి, అక్కడ మిగిలినవారితో కలిసి కౌన్సిలింగ్‍లాంటిదేదో చేస్తుంది. ఇంకో రెండ్రోజులు పక్క వీధిలో వున్న గుడికి వెళ్ళి పూలమాలలూ అవీ కట్టిచ్చి వస్తూంటుంది. యిలాగ యేదో పని కల్పించుకుని వూరు పట్టుకు తిరుగుతోందని నాన్నగారి అభియోగం. అన్నీ వండి పెట్టే వెడుతున్నాను కదా అని అమ్మ అంటుంది. “వండి పడేస్తే చాలా..నేనొక్కణ్ణి యెలా వుండగలననుకున్నావ్?” అని నాన్నగారి ప్రశ్న. “కాసేపే కదా వెడుతున్నాను. మీరు కూడా మీ కాలక్షేపమేదో చూసుకోండి..” అని అమ్మ జవాబు. నాకైతే అంతా అయోమయంగా అనిపించింది. యిన్నాళ్ళు లేని వ్యాపకాలు అరవయ్యేళ్ళు వచ్చేక యిప్పుడు అమ్మ యెందుకు కల్పించుకున్నట్టు? హాయిగా యిద్దరూ వేళకింత వండుకుని, తిని, ఒకరికొకరుగా వుండక లేనిపోని గొడవలు కోరి తెచ్చుకోవడమెందుకు? ఈ నాలుగురోజుల్లోను ఈ మాట అమ్మని అడుగుదామని చాలా ప్రయత్నించాను కానీ అడగలేకపోయాను.

  నా ఆలోచనల్లో వుండిపోయి ట్రైన్ యెప్పుడు బయల్దేరిందో కూడా గమనించనేలేదు. టీసీ వచ్చి టికెట్ అడిగేటప్పటికి మళ్ళీ ఈ లోకంలో కొచ్చాను.  టీసీకి టికెట్ చూపించి మళ్ళీ దానిని బేగ్‍లో పెట్టుకుంటుంటే అందులో యేవో కాగితాల మడతల్లాంటివి కనిపించాయి. ఇవేం కాగితాలు..నేనేం పెట్టలేదే అనుకుంటూ మడతలు విప్పగానే  మొదటి పదమే “అమ్మలూ..” అంటూ అమ్మ చేతివ్రాత. ఒక్కసారి ఒళ్ళు జల్లుమంది. అమ్మ ఉత్తరం అది. అమ్మ ఉత్తరం రాసి నా బేగ్‍లో పెట్టింది. అంత ఉత్తరం రాసి చెప్పవలసిన విషయాలు యేమున్నాయా అన్న ఆతృతతో నా కళ్ళు ఆ అక్షరాల వెంట పరుగెత్తాయి.

  “అమ్మలూ, పిల్లల పరీక్షల ముందు నువ్వు అమ్మనీ నాన్ననీ చూడడానికి యింత ఆతృతగా యెందుకొచ్చావో అర్ధం చేసుకోగలనమ్మా.. నా బంగారుతల్లీ, మామీద నీకున్న అభిమానానికి యెంత సంతోషంగా వుందో చెప్పలేను. నువ్వు నన్ను అడగాలనుకున్న ప్రశ్నలు నీ గొంతులోనే ఆగిపోయాయని తెలుసుకోలేనిదాన్ని కాదు. ఈ వయసులో నాన్నగారిని దగ్గరుండి చూసుకోకుండా నేను చేసే ఘనకార్యాలు నీకు మింగుడు పడలేదు కదూ! అవునమ్మా.. నిజమే.. మీ నాన్నగారికి డెభ్భైయేళ్ళు. నాకు అరవైయేళ్ళు దాటాయి. ఇదివరకంతా నాన్నని నీడలాగా కనిపెట్టుకుని వున్న అమ్మ ఈ పెద్ద వయసులో ఆయనని ఒక్కరినీ వదిలేసి బైట చేస్తున్న రాచకార్యాలకి కారణమేమిటో తెలుసుకోవాలని వుంది కదా తల్లీ. చెపుతాను విను.

 అమ్మలూ, నీకూ తెలుసు.. నిన్నూ, చెల్లెల్నీ యెలా కళ్ళల్లో పెట్టుకుని పెంచానో. మీరు కాలేజీ చదువులు చదువుతున్నప్పుడు కూడా మీ చేత యింట్లో యే ఒక్క పనీ చేయించలేదు సరి కదా.. మీ యిద్దరికీ అన్నం కూడా కలిపి నోట్లో పెట్టేదాన్ని. అలాగ మీకు ఒక్కపనీ నేర్పకుండానే, అందరూ అమ్మలాగే వుంటారని చెపుతూనే మీకు పెళ్ళిళ్ళు చేసి పంపించాను. అలాగ పువ్వుల్లాగ పెరిగిన మీరిద్దరూ పూల కన్న ముళ్ళే యెక్కువగా వున్న ఈ సమాజంలో మీ సౌరభాన్ని నిలబెట్టుకుందుకు  మీరు పడ్డ కష్టం మీకు తెలియనిది కాదు. ఆ భగవంతుని దయవల్ల యిద్దరూ మీమీ కుటుంబాల్లో యిమిడిపోయి మంచిపేరు తెచ్చుకున్నారు. మీరిద్దరూ అన్నీ మీ మీ అనుభవాలమీదే నేర్చుకున్నారు. ఒక ఐదారు సంవత్సరాలు మీరు శ్రమ పడినా మిగిలిన జీవితమంతా మీరు మీకు అనుకూలంగా మలుచుకున్నారు.  కానీ ఒకరిమీద ఒకరం పూర్తిగా ఆధారపడ్డ నాకూ, మీనాన్నగారికీ మా రాబోయే జీవితం గడపడానికి అలాగ అనుభవం మీద నేర్చుకునే టైమ్ యిప్పుడు లేదమ్మా. ఇద్దరం జీవితం చరమాంకానికి వచ్చేసాం.

    అమ్మలూ, నీకు తెలుసు కదా! యింట్లో మీ యిద్దరితో సమానంగా నాన్నగారిని చూసుకునేదాన్ని. పొద్దున్న లేచిందగ్గర్నుంచీ ఆయన తిండితిప్పలూ, అలవాట్లూ, చిరాకులూ అన్నింటినీ ఆయన కూడా ఒక పిల్లాడే అనుకుని నిభాయించుకుని వచ్చేదాన్ని. మీలాగే ఆయనకూడా నామీద పూర్తిగా ఆధారపడిపోయారు. మీరు బైటకి వెళ్ళి నాలుగూ నేర్చుకున్నారేమో కానీ, నాన్నగారు మటుకు మీరు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళాక నా మీద ఆధారపడడం మరీ యెక్కువైపోయింది. నాకూ అది ఆనందంగానే అనిపించేది. యెందుకంటే మీ నాన్నగారంటే నాకున్న యిష్టం వల్ల. కానీ, తల్లీ.. ఆరునెల్లక్రితం జరిగిన ఒక సంఘటన నాలో యిదివరకు లేని ఆలోచనను తట్టిలేపింది.

  నీకు మన దయానందం  తెల్సుకదా.. ఆయన భార్య హఠాత్తుగా పోయింది. పాపం దయానందం. భార్య వున్నన్నాళ్ళు మంచినీళ్ళు కూడా ముంచుకుని యెరగడు. పిల్లలు  యెవరి సంసారాలు వాళ్లవి. వాళ్ల దగ్గరికి వచ్చి వుండమన్నా కూడా యిల్లూ, పెన్షనూ వచ్చినన్నాళ్ళు యెవరి దగ్గరికీ వెళ్లలేరు కదా! అలాగ ఒక్కడే వుంటున్నాడు. వంట మాట అలా వుంచు..ఉదయం లేచి కాఫీ పెట్టుకోడం కూడా రాదు. ఎవరిని యేమడగాలో తెలీదు. అది చూసి నాకు ఒక్కసారి భయంలాంటిది వేసింది. అనుకోడానికి యిష్టమున్నా లేకపోయినా  పునర్జన్మ సిధ్ధాంతం నమ్మినవాళ్లం మనం. ఆ భగవంతుడి పిలుపు యెప్పుడోప్పుడు  రాకతప్పదు. అందరం యెప్పుడో అప్పుడు పైకి వెళ్ళవలసినవారమే! యెవరు ముందో యెవరు వెనకో యెవరికి తెలుసు? ఒకవేళ నేను ముందు వెళ్ళిపోతే మీ నాన్నగారికి కంచంలో అన్నం యెవరు వడ్డిస్తారు? టేబిలు మీదున్న గిన్నెల్లో ముందుది వేసుకుని, వెనకది చూసుకోని మీ నాన్నగారి పరిస్థితి యేమిటి? ఆయనకి మంచినీళ్ళు యెవరు అందిస్తారు? మేం లేమా అంటారు మీరిద్దరూ. కానీ, ఆయనింట్లో ఆయనుంటే వున్న గౌరవం మీ యిళ్ళకొచ్చి వుంటే వుండదు కదా! అయినా చిన్నప్పట్నుంచీ యెవరింటికీ వెళ్ళని మనిషి కూతురింట్లో యెలా వుంటారు? మీరు మీ సంసారాలని వదిలి ఆయన దగ్గరకొచ్చి వుండలేరు కదా! యెల్లకాలమూ నేను ఆయన పక్కన వుండలేనని నాన్నగారికి తెలియాలి. చిన్న చిన్న పనులైనా ఆయనంతట ఆయన చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. నేను యింట్లో వున్నంతసేపూ మీ నాన్నగారు అలా చెయ్యరు. అందుకనే నేను బైటకి వెళ్ళడం అలవాటు చేసుకున్నాను. కావాలని వ్యాపకాలు పెంచుకున్నాను. ఆయన ఆకలి ఆయనకి తెలియాలనీ, ఎక్కడెక్కడేమున్నాయో చూసుకుని కావలసినవి తీసుకుని తినడం తెలుసుకోవాలనీ అనుకున్నాను. నేను బైటకి వెడితే మధ్యాహ్నం టీ పెట్టుకోవడం యెలాగో చెప్పాను. యివన్నీ చెపుతున్నప్పుడు నాలో నేను యెంత మథనపడ్డానో తెలుసా తల్లీ.. కానీ అంతకన్న దారిలేదు. వంటమనిషిని పెట్టి వండించుకున్నా, లేకపోతే బైటనుంచి భోజనం తెప్పించుకున్నా రేపు నేను వెళ్ళిపోయాక కనీసం టేబిలు మీదున్నవయినా వడ్డించుకు తినే అవకాశముంది. మొన్నమొన్నటివరకూ మీ నాన్నగారు పూర్తిగా నామీద ఆధారపడేవారు. నాకు అదెంత సంతోషంగా అనిపించేదో!  కానీ, దయానందాన్నిచూసాక ఒకవేళ నేను ముందు వెళ్ళిపోతే మీ నాన్నగారి పరిస్థితి యెలా వుంటుందోనని భయపడి యిలా చెయ్యవలసివచ్చింది. ఒక్క విషయం చెప్పనా తల్లీ..మనం ఆడవాళ్ళం.. ప్రతి ప్రసవానికీ మరణం అంచులదాకా వెళ్ళొస్తాం కనుక మన గుండె కొంచెం గట్టిగా వుంటుంది. కానీ, మగవాళ్ళు యెంత పెద్దవాళ్ళైనా పసిపిల్లలేనమ్మా.. వాళ్ళని యెప్పుడూ అమ్మో, భార్యో, కూతురో చూస్తూండాలి.

 అమ్మలూ,  యిదంతా చదువుతుంటే నీకు యింకో ప్రశ్న రావచ్చు. తప్పులేదు.. యెవరు ముందో యెవరు వెనకో యెవరు చెప్పగలరు? ఒకవేళ నేనే ఒంటరిదాన్నయిపోతేనో.. అవును.. ఆడవాళ్ళు వొంటరిగా మిగిలిపోతే వారి బాధ వేరుగా వుంటుంది. అందుకే యెప్పుడూ పట్టించుకోని నేను మీ నాన్నగారిని డబ్బు విషయాలు అడగడం మొదలుపెట్టాను. మన శాంతి తెలుసు కదా.. వాళ్ళమ్మ..పాపం యిలాగే ఒంటరి దయిపోయింది. వాళ్లాయనకి యే బేంక్‍లో యెంత డబ్బుందో ఆవిడకి అస్సలు తెలీదు. పక్కన వున్న ఆవిడకే తెలీకపోతే యెక్కడో ఉద్యోగాల్లో వున్న పిల్లలకి మాత్రం యెలా తెలుస్తుంది? అందుకే మీ నాన్నగారిని ఏ బాంక్‍లో ఎంత డబ్బుందో చెప్పమన్నాను. అలా అడిగానని ఆయనకి కోపం కూడా వచ్చింది. కానీ నా భయం నన్నలా అడిగించింది తల్లీ.

 యిన్ని విషయాలు తెలిసున్నదానివి ఈ నాలుగురోజులూ నాన్నగారితోనే గడపకుండా ఆయన్ని ఒంటరిగా వదిలి బైటకి యెందుకు వెడుతున్నాననుకుంటున్నావేమో.. చెపుతాను విను.. అమ్మలూ, నాకు పెళ్ళయి వచ్చినప్పటినుంచీ మీ నాన్న చుట్టూ తీగలా అల్లుకుపోయాను. ఆయనలేని జీవితాన్ని ఊహించలేని స్థితికి వచ్చేసాను. మీ నాన్న తప్పితే అంత ఆసరా మరింక యెవ్వరూ యివ్వలేరు. అందుకే ఆయన చుట్టూనే ముడులూ, బ్రహ్మముడులూ వేసేసుకున్నాను. కానీ, ఒక్కసారి శాంతివాళ్ళమ్మ పరిస్థితి చూసేసరికి నన్ను వెన్ను మీద యెవరో చరిచినట్లయింది. యిప్పటినుంచీ ఆ ముడులను విప్పుకుని, నా అంతట నేను నిలబడలేకపోతే మూలమే కదిలిపోయి నేలమీదపడి అందరి కాళ్ళకిందా నలిగిపోతాను. అందుకే నా మనసుని నేను గట్టి చేసుకున్నాను. కనీసం పగలు రెండుగంటలైనా మీ నాన్నగారు ఒంటరిగా వుండేలా చెయ్యాలనుకున్న నేను, నాకు కూడా ఈ యిల్లు కాక మరో ఆసరా కావాలనిపించింది.

  తల్లీ, ఒక్క మాట చెప్పనా.. మనిషి బ్రతికున్నన్నాళ్ళు తిండీ, బట్టా కనీసావసరాలు. మన ఆకలికి తిండి తినడం తప్పనిసరి యెల్లాగో అలాగే ఎదుటి మనిషికోసం బట్ట కట్టుకోవాలి. లేకపోతే మనలను పిచ్చివాళ్ళకింద జమకడతారు. కానీ, ఈ రెండింటితోపాటు మనసన్నది కూడా ఒకటుంటుంది కదమ్మా. దానికి సరైన ఆలోచన లేకపోతే అది దెయ్యమై పీక్కు తింటుంది. అందుకని నా మనసుకి తృప్తి కలిగించుకుందుకు నేను ఆ వ్యాపకాలు పెట్టుకున్నాను.

  ఇంకోవిషయం చెప్పనా తల్లీ.. బాల్యం మనకి తెలీకుండానే ఆనందంగా గడిచిపోతుంది. యవ్వనం మనం కావాలని ఆనందిస్తూ గడుపుతాం. మధ్యవయసు సంతోషంగా చేసే బాధ్యతల బరువుతో నడుస్తుంది. యివన్నీ ఆనందంగా స్వీకరిస్తున్న మనం వానప్రస్థాన్ని మటుకు అంతే ఆనందంగా యెందుకు స్వీకరించకూడదు? వార్ధక్యం అంటే భయమెందుకు? అన్నింటికీ ఆ భగవంతుడే వున్నాడనుకుంటూ తామరాకుమీది నీటిబొట్టులా గడపడానికి యెందుకు ప్రయత్నించకూడదూ అన్నదే నా ప్రశ్న. నేను అందుకే డిటాచెడ్ గా వుండడానికి ప్రయత్నిస్తున్నాను. ఇలా చెయ్యడం నాకూ చాలా కష్టంగానేవుంది కానీ తప్పదుగా మరీ!..

తల్లీ, పండితులొకరు వానప్రస్థమంటే యేమిటో విడమరిచి చెప్పారు. మనని మనం ఈ సంసారబంధాలకు గట్టిగా కట్టేసుకున్నాం. వానప్రస్థమంటే ఆ బంధాలను వదులుకోవడం కాదుట. గట్టిగా కట్టుకున్నబంధాలు కాస్త వదులవడానికి ఆ కట్టుపైన మరోకట్టు యింకా గట్టిగా కట్టడంట. అప్పుడు ముందు కట్టినకట్టు కాస్త వదులవుతుందన్నమాట. అంటే సంసార బంధాలను కాస్త తగ్గించుకుని, ఆధ్యాత్మికతవైపుకానీ, సామాజిక సమస్యలవైపు కానీ మరో బంధం యేర్పరచుకోవడం. అందుకే నేను నాకున్న పరిథిలో కొన్ని వ్యాపకాలను యేర్పరచుకున్నాను.

  తల్లీ, నువ్వు నన్ను అడగబోయి మానుకున్న ప్రశ్నలకి సమాధానాలు దొరికేయనుకుంటాను. యిప్పుడిదంతా  యింత వివరంగా యెందుకు రాస్తున్నాననుకుంటున్నావేమో..దానికి  ముఖ్యకారణంఒకటుంది. నేను మీ అక్కచెల్లెళ్ళిద్దరినీ ఒక్క కోరిక కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు నన్నొక్కదాన్నీ వుంచితే మీరు ఫోన్ చెయ్యడం కాస్త ఆలస్యమైనా మీ సంసారబాధ్యతలు తెలిసినదాన్ని కనుక అర్ధం చేసుకోగలను. కాని అలా కాకుండా నాకే ఆయన పిలుపు ముందుగా వస్తే కనక మీ నాన్నని వారం, పదిరోజుల కొక్కసారైనా ఫోన్‍లో కాస్త పలకరిస్తూండండి. మీ దగ్గరనుంచి ఫోన్ రావడం నాలుగురోజులు దాటిన దగ్గర్నుంచీ మీరెలా వున్నారోనని ఆయనలో ఆతృత మొదలౌతుంది. అది రోజురోజుకీ పెరిగి మరో నాలుగురోజులయ్యేటప్పటికి యింక అదే ధ్యాసలో పడిపోయి, మీ గురించి లేనిపోనివి ఊహించేసుకుని బెంగ పెట్టేసుకుంటారు. అందుకని నువ్వూ, చెల్లీ కూడా మీ నాన్నకి వారానికోసారి ఫోన్ చేస్తామని ఈ అమ్మకి మాటిస్తారు కదూ...

…. మారిపోయిన మీ అమ్మ..

చేతులమధ్య నలిగిపోతున్నకాగితం  చివర వున్న “అమ్మ” అన్న మాటను చదవడానికి నాకు కళ్ళనిండుగా వున్న నీళ్ళు అడ్డం వచ్చేయి.


 JANUARY 18, 2017 సారంగ-సాహిత్యవారపత్రికవారి సౌజన్యంతో..

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------


మంచి కథ  4................ (DIGNITY OF LABOUR) MAY DAY SPECIAL

పండుగ రోజున క్రొత్త చెప్పులు వేసుకునే సెంటిమెంట్ నాకుఅందుకే క్రొత్త చెప్పులు కొందామని ఓ ప్రముఖ చెప్పుల దుకాణం కు వెళ్ళాను,
షాపులోని సేల్స్ మేన్ నాకు రకరకాల క్రొత్త చెప్పులు చూపిస్తున్నాడుకానీ సైజు కరెక్ట్ ఉంటే చెప్పులు నచ్చడం లేదునచ్చిన చెప్పులు సైజు సరిపోవడం లేదుఅయినా పాపం సేల్స్ మేన్ ఓపిగ్గా ఇంకా కొత్తరకాలు తీసుకొచ్చి చూపిస్తున్నాడు,
అంతలో షాపు ముందు ఓ పెద్ద కారు వచ్చి ఆగిందిఅందులోనుండి ఓ వ్యక్తి హూందాగా షాపులోకి వచ్చాడుఆయన్ని చూడగానే సేల్స్ మేన్స్ అందరూ మర్యాదగా లేచి నిలబడి నమస్కారం చేసారుఆయన చిరునవ్వుతో యజమాని సీట్లో కూర్చొని దేవునికి నమస్కారం చేసి తన పనిలో నిమగ్నం అయ్యారు
మీ యజమానాఅని సేల్స్ మేన్ ను అడిగాను
అవును సార్ఆయన మా యజమాని ,ఇలాంటి షాపులు ఆయనకు ఓ పది వరకు ఉంటాయిచాలా మంచి మనిషి అండి అని  ఓ క్రొత్త రకం చెప్పుల జత చూయించాడుఆ చెప్పుల జత చూసే సరికి నాకు తెలియకుండానే నా పెదాల మీద చిరునవ్వు వచ్చేసిందికానీ సైజే కాస్త అటుఇటు గా ఉన్నట్టుందిచెప్పుల జత నాకు నచ్చిన విషయం సేల్స్ మేన్ కనిపెట్టినట్టున్నాడు ,ఎలాగైనా నాతో ఆ చెప్పులజత కొనిపించేయాలని తెగ ఆరాట పడుతున్నాడుకాస్త బిగుతుగా ఉన్నట్టున్నాయి కదా అంటేఅబ్బే అదేం లేదు సార్మీకు కరెక్ట్ సైజే అంటూ బలవంతపెట్టడం మొదలుపెట్టసాగాడుఇదంతా గమనిస్తున్న షాపు యజమాని లేచి వచ్చి నాముందు క్రింద కూర్చుని సార్ ఓసారి మీ పాదం ఈ చెప్పులో పెట్టండి అని నా పాదం ను తన చేతిలో తీసుకుని చెప్పును తొడిగాడు,, నాకు అంత పెద్ద మనిషి (వయసు లో పెద్దహోదాలో కూడా) నా పాదం ముట్టుకుని చెప్పు తొడుగుతుంటే ఇబ్బంది గా అనిపించిందిపరవాలేదులెండి సర్ నేను  తొడుక్కుంటాను లెండి అని వారిస్తున్నా అతను వినకుండా రెండు కాళ్ళకు తన చేతులతో నాకు చెప్పులు తొడిగి లేచి నిలబడి ఓసారి నడిచి చూడండి సర్మీకు కంఫర్ట్ గా ఉన్నాయో లేదోలేకుంటే మరో జత చూద్దాం అన్నారుకానీ ఆ జత సరిగ్గా సరిపోయాయినేను బిల్ పే చేస్తూ షాపు యజమాని తో మనసులో మాట బయటపెట్టానుసర్ మీరు ఈ హోదా లో ఉండికూడా మా పాదాలు పట్టుకుని మరీ చెప్పులు తొడగడం మాకు ఇబ్బంది గా ఉందండీఅన్నాను,
ఆయన చిల్లర తిరిగి ఇస్తూ చిరునవ్వుతో సర్! ఇది నా వృత్తినాకు దైవం తో సమానం
"షాపు బయట మీరు కోటి రూపాయలు ఇస్తాను అన్నా నేను మీ పాదాలు ముట్టుకోనుఅదే షాపు లోపల మీరు కోటి రూపాయలు ఇచ్చినా మీ పాదాలు వదలను " అన్నారు.. 
నాకు ఆశ్చర్యమేసింది,
ఎంత గొప్ప వ్యక్తిత్వం! 
Dignity of labour 
******************
తను చేసే పని మీద గౌరవంనిబద్ధత! 
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే పాఠం నేర్పడానికి నాకు దేవుడు పంపిన గురువు లా కనిపించారు,
మనం చేసే పని చిన్నదాపెద్దదాఅన్నది కాదు సమస్యన్యాయబద్ధ మైందాకాదా అని చూడాలిన్యాయబద్ధమయినప్పుడు చేసే చిన్న పనికి సిగ్గు పడకూడదు. 
ఎప్పుడూ మనం చేసే పనిని కానీఉద్యోగం ను కానీ తిట్టరాదుఅదికూడ లేక రోడ్ల మీద వృధా గా తిరుగుతున్న వారు చాలామంది ఉన్నారని గుర్తు పెట్టుకోవాలని కోరుతూ.

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------


మంచి కథ  5................

*ఆరు రూపాయలు*
మల్లాది వెంకటకృష్ణమూర్తి

ఓ ఊళ్ళోరాముడ్ని కొలిచే వెంకట్రావు అనే భక్తుడు ఉండేవాడు. అయితే అతను బంగారం పట్టినా మట్టయ్యేది. దాంతో దరిద్రాన్ని అనుభవించేవాడు.
ఓ రోజు అతని భార్య అతనికి ఓ సలహా ఇచ్చింది.
"రాముడ్ని మన దరిద్రం తీర్చమని ప్రార్ధించరాదూ? ఆయన మీ కోరిక తప్పక తీరుస్తాడు".
"పిచ్చిదానా! మనకేం కావాలో ఆయనకు తెలీదా? అందుకు నేనాయనకు సూచనలు ఇవ్వలేను" అని అతను ఒప్పుకోలేదు.
ఆ రాత్రి రాముడు అతనికి కలలో కనబడి చెప్పాడు.
"నీ ఇంట్లోని గూట్లో ఆరు రూపాయలు ఉన్నాయి కదా? అవి తీసుకొని రేపు సాయంత్రానికల్లా నువ్వు పెద్ద బజారుకి వెళ్ళు. అక్కడ ఆరు రూపాయలకి నీకు ఇష్టమైంది ఏది కనబడితే అది కొను. నీ దరిద్రం తీరుతుంది."
ఉదయం నిద్రలేవగానే తన భార్యకి ఆ కల గురించి చెప్పి, అతను సైకిలు మీద పెద్ద బజారుకి బయలు దేరాడు. ఓ చోట కోలాటం కర్రలు నచ్చి దాని ధరని అడిగాడు. జత పది రూపాయలు. ఇంకొంచెం ముందుకు సాగాడు, వేలంపాట వేసే ఓ హాల్లో బొమ్మలని వేలం వేస్తున్నట్లు బయట బోర్డుని చూసి లోపలకి వెళ్ళాడు. గోడకి ఓ పెద్ద చిత్రకారుడు గీసిన బొమ్మలు వేలాడుతున్నాయి. వాటిని కొనడానికి ఖరీదైన దుస్తుల్లో డబ్బున్న వాళ్ళు చాలామంది వచ్చారు. అతను వెనక్కి తిరిగిపోతుంటే పిచ్చి గీతాలతో గీసిన ఓ బొమ్మని చూపించి చెప్పారు నిర్వాహకులు.
"దీని పేరు శ్రీ రామచంద్రుడు. దీన్ని గీసింది దీపక్ అనే ఆరేళ్ళ కుర్రాడు. మా పాట అయిదు రూపాయలు."
చిన్న పిల్లవాడు గీసిన ఆ నైపుణ్యం లేని బొమ్మని కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. అసహానంగా పెద్ద చిత్రకారుడి బొమ్మల వేలంపాట మొదలవడం కోసం వారంతా వేచి చూడసాగారు.
"మొదటిసారి అయిదు రూపాయలు....రెండవసారి..అయిదు రూపాయలు...."
అది రాముడి బొమ్మ అవడంతో, వెంకట్రావు గట్టిగా 'ఆరు రూపాయలు' అని అన్నాడు.
" ఆరు రూపాయలు, ఒకటోసారి..రెండోసారి..."
దాన్ని కొనడానికి అక్కడున్న వారు ఎవరూ ముందుకు రాకపోవడంతో, 'మూడోసారి' అని డబ్బు తీసుకుని ఆ బొమ్మని వేలంపాట నిర్వాహకులు వెంకట్రావుకి ఇచ్చారు. అక్కడున్న వాళ్ళంతా ఆ బొమ్మని కొన్న వెంకట్రావు వంక వింతగా చూసారు.
"వేలంపాట  మొత్తం ముగిసింది." అని చెప్పారు నిర్వాహకులు.
'అదేమిటి? ఇంకా గోడకి వేలాడే ఆ అసలు బొమ్మలని వేలం వేయాలిగా?" అడిగారు కొనడానికి వచ్చిన వాళ్ళు.
"ఈ బొమ్మలని గీసిన చిత్రకారుడు అతని వీలునామాలో ఏం రాసాడో వినండి. అకాల మృత్యువువాత పడిన తన కొడుకు గీసిన బొమ్మని మొదటగా అయిదు రూపాయలతో వేలం వేయాలని, దాన్ని ఎవరు కొంటే వారికి తను గీసిన చిత్రాలన్నిటిని ఉచితంగా ఇవ్వాలని రాసాడు. కొడుకు గీసిన అసంపూర్ణ చిత్రానికి తన ప్రేమతో ఎంతో విలువ చేకూర్చాడు.. ఎందుకంటే తండ్రిగా తన కొడుకు గీసిన బొమ్మ మీద అతని ప్రేమ అలాంటిది. కాబట్టి మీరు కోరుకున్న చిత్రాలని మీరు ఇతని నుండి కొనుగోలు చేయండి."

ఎవరైనా దేవుణ్ణి కానీ, దేవుడిచ్చిన మనసుని కానీ నిజంగా ప్రేమించగలిగితే... అతని విలువకు పది ఇంతల విలువను చేకూర్చడానికి, అవి మీకు సహకారం అందించడానికి ఒక తండ్రిగా మీ వెంట ఉంటాయి..ఆ ప్రేమని పొందగలిగిన వాళ్ళు నిజంగా ధన్యులు..


మంచి కథ  6................

🕉 *భగవత్ కృప*


రాత్రి 9 గంటల ప్రాంతంలో నాకు అకస్మాత్తుగా ఎలర్జీ వచ్చింది. ఇంటిదగ్గర మందు లేదు. నేను తప్ప ఇంట్లో ఎవరూ లేరు. భార్య పిల్లలు పుట్టింటికి వెళ్ళారు. నేను ఒక్కడినే ఉండిపోయాను. డ్రైవర్ కూడా తన ఇంటికి వెళ్లిపోయాడు. వర్షాకాలం కనుక బయట కొద్దిగా వాన పడుతున్నది. మందు దుకాణం ఎక్కువ దూరం లేదు. నడుచుకుంటూ కూడా వెళ్ళగలను. కానీ వాన పడుతున్నది కనుక నేను రిక్షా చేసుకోవడం సరైన పని అనుకున్నాను. 

పక్కనే రాముని గుడి కడుతున్నారు. ఒక రిక్షా అతడు భగవంతుడిని ప్రార్థిస్తున్నా డు. నేను అతడిని వస్తావా అని అడిగాను. అతను వస్తాను అని తల ఊపంగానే నేను ఎక్కేసాను. రిక్షా అతను చాలా అనారోగ్యంగా అనిపించాడు. అతని కళ్ళల్లో కన్నీరు కూడా ఉంది. “ఏమైంది నాయనా? ఎందుకు ఏడుస్తున్నావు? ఒంట్లో బాగోలేదులా ఉంది.” అని నేను అడిగాను. “వర్షం వల్ల మూడు రోజుల నుండి ఎవరూ దొరకలేదు. ఆకలిగా ఉంది. ఒళ్ళు నొప్పులుగా కూడా ఉంది. ఇప్పుడే భగవంతుని ప్రార్థిస్తున్నాను. ‘భోజనం పంపించు నాయనా’ అని.” అని అతడు చెప్పాడు. 

నేను ఏమీ మాట్లాడకుండా రిక్షా ఆపించుకుని, మందు దుకాణానికి వెళ్ళిపోయాను. అక్కడ ఆలోచిస్తూ ఉన్నాను. ‘భగవంతుడు నన్ను ఇతని సహాయం కోసం పంపలేదు కదా? ఎందుకంటే ఇదే ఎలర్జీ అరగంట ముందు వచ్చి ఉంటే నేను డ్రైవర్ని పంపేవాడిని. రాత్రి బయటకు పోవటం నాకు అవసరం ఉండేది కాదు. నేను కూడా వెళ్ళాలనుకునే వాడిని కాదు.’ భగవంతుని అడిగేసాను- నన్ను ఈ రిక్షా అతడి సహాయార్థం పంపావు కదా? అని. జవాబు ‘అవును’ అని వచ్చింది. 

నేను భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకొని, నా మందుతో పాటు రిక్షావాడి కోసం కూడా మందు తీసుకొన్నాను. పక్కనే ఒక చిన్న రెస్టారెంటులో ఛోలే భటూరే కొని, ప్యాక్ చేయించి, వచ్చి రిక్షా ఎక్కి కూర్చున్నాను. ఏ గుడి ముందర రిక్షా ఎక్కానో అక్కడికే వచ్చి ఆపించుకుని, దిగాను. అతడి చేతిలో 30 రూపాయలు పెట్టి, వేడి వేడి ఛోలే భటూరే, మందులు ఇచ్చి, ఇట్లా చెప్పాను- “ఈ ఆహారం తిని మందు వేసుకో. ఒక్కొక్క మాతర- ఇవి ఇవాళ, ఇవి రేపు పొద్దున టిఫిన్ తిన్న తర్వాత. ఆ తర్వాత నాకు వచ్చి చూపించుకుని వెళ్ళు.” 

అప్పుడు రిక్షా అతను ఏడుస్తూ అన్నాడు- “నేను భగవంతుడిని రెండు రొట్టెలు అడిగాను. ఆయన నాకు ఛోలే భటూరే పెట్టాడు. చాలా నెలల ముందు నాకు ఇవి తినాలి అని కోరిక కలిగింది. ఈరోజు భగవంతుడు నా ప్రార్థన విన్నాడు. భగవంతుని మందిరం దగ్గర ఆయన భక్తుడిని నా సహాయం కోసం పంపించాడు.” 

అట్లా ఇంకా ఏవేవో మాటలు చెప్తూ ఉండిపోయాడు. నేను స్తబ్ధంగా ఉండి వింటూ ఉండిపోయాను. ఇంటికి వచ్చి ఆలోచించాను- ఆ రెస్టారెంట్ లో చాలా వస్తువులు ఉన్నాయి. నేను ఏదైనా కొనగలిగేవాడిని. సమోసా, లేదా భోజనం కానీ.. నేను చోలే బటూరే మాత్రమే ఎందుకు కొన్నాను? నిజంగా భగవంతుడు రాత్రిపూట తన భక్తుని సహాయార్థం నన్ను పంపాడు. 

మనము ఎవరికైనా సహాయం చేసేందుకు సరైన వేళకు చేరితే భగవంతుడు అతని ప్రార్థన విన్నాడు అని దాని అర్థం. మనను తనకు ప్రతినిధిగా పంపాడు అని అర్థము. 

ఓ భగవంతుడా ఎప్పుడూ నాకు సరైన దారి చూపిస్తూ ఉండు తండ్రీ!

మంచి కథ  7................



కధ చెబుతాం... ఊ కొడతారా...

సామెత ల కధలు

శ్రీమతి రేగులగెడ్డ వెంకట లక్ష్మీ గాయత్రి వ్రాసిన కధ
                 ----------------------------------

చోడవరం నాలుగు రోడ్ల కూడలిలో బజ్జీలమ్మే అప్పారావు కొడుకు ప్రకాశం.ప్రకాశం పంతులు గారంత గొప్పోడివవ్వాలిరా పెకాశం అంటుండేవాడు అప్పారావు తన కొడుకుతో.

నా కొడుకుని కలకటేరుని చేస్తానని అందరికీ చెప్పేవాడు. "ఎంత చెట్టుకి అంత గాలి" అంటారు మావా,నువ్వు  "గాలిలో మేడలు కట్టేస్తున్నావు" అని అప్పారావు భార్య రంగమ్మ అనేది.
బడిలో బాగా చదివే ప్రకాశం , లెఖ్ఖల మాష్టారు రాఘవులు గారిని అడిగాడు కలక్టరు అవ్వడమెలా అని.అది విన్న తోటి మాష్టర్లు "ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికెగిరిందట". ముందు10వ తరగతి పూర్తి చేయరా చాలు అని నవ్వారు.

రాఘవులు మాష్టారన్నారు,ప్రకాశం పంతులు గారి తల్లి పూటకూళ్ళమ్మ కాదా? ఆయన గొప్పవారు కాలేదా అని. "పులిని చూసి నక్క వాతపెట్టుకుందన్నట్లు" ఆయనలా అవ్వగలడా అన్నారు మాష్టర్లు.

కలెక్టరు కావాలంటే బోలెడు పుస్తకాలు చదవాలి. "ఆస్థి మూరెడు ఆశ బారెడు"  అని వెక్కిరించేవారు కొందరైతే,ఉచిత విద్య,ఉచిత పుస్తకాలు,ఉచిత భోజనం చదువు నీదని కొందరనేవారు.

"దూరపు కొండలు నునుపు" రా, దగ్గరకెళ్తే కాని రాళ్ళు,ముళ్ళు కనపడవనేవారు కొందరు.
రాఘవులు మాష్టారు మాత్రం "నవ్విన నాపచేనే పండుతుందిరా", గ్రంథాలయానికి వెళ్ళడం అలవాటు చేసుకో. అది సరస్వతీమాత ఇల్లు.అక్కడ జ్ఞానమనే తిండి పుష్కలంగా దొరుకుతుంది అనేవారు.

అదే తారకమంత్రం అయింది మన ప్రకాశానికి. సంవత్సరాలు గడిచాయి.
ఇళ్ళ స్థలాల పట్టాలివ్వడానికి చోడవరం వచ్చిన కలెక్టరు ప్రకాశం గారిని చూసి "కృషితో నాస్తి దుర్భిక్షం" అనుకున్నారంతా.

మంచి కథ  8................
మొదలుమీది .. కొనసాగింపు మాది ..
*************************

శ్రీమతి  రేగులగెడ్డ వెంకట లక్ష్మీ గాయత్రి వ్రాసిన కధ

గుళ్ళోంచి విష్ణు సహస్రనామం వినిపిస్తోంది.
మర్రిచెట్టు మీద పక్షుల సందడి పెరుగుతోంది.
నూతిలో చేద చప్పుళ్ళు వినిపిస్తున్నాయి.
మడిపంచ కట్టుకుని పువ్వులేరడానికి బయటకొచ్చారు రాఘవులు గారు.
"వంటింట్లో కాఫీడికాక్షన్ వాసన...పాలు పొంగిన వాసన కలగలిపి ముక్కును తాకింది"

 శంఖు పువ్వులు,నందివర్ధనాలు,గొబ్బిపూలు,మందారాలు కోసి
గోమాతకి గడ్డివేసి తినమని నిమురుతున్న రాఘవులు గారు కాఫీ వాసన ముక్కుకి తగలగానే "ఏమే కాఫీ" అని కేకేసారు.

పూజ చేసేవరకూ ఆగలేరు కదా అంటూ కాఫీ తెచ్చారు లక్ష్మి గారు. ఆత్మారాముడికి ఏమీ సమర్పించకుండా పూజకి వెళ్ళడం పాపమే అయినా ముసలి ప్రాణం కాఫీ పడకపోతే కదలలేదే అంటూ కాఫీ అందుకుని తాగుతూ ఎదురు ఖాళీ స్థలంలో టెంటు వేయడం చూసి ఏదైనా విశేషం ఉందేమో, కార్తీకమాసం కదా అనుకుంటూ పూజకి లేచారు రాఘవులుగారు.

పూజ ముగించి హాలులోకి వచ్చిన రాఘవులుగారు అక్కడ కూర్చున్న జంటని చూసి ఎవరూ అని అడిగారు కళ్ళజోడు సరి చేసుకుంటూ. నేను మాష్టారూ శంకరాన్ని. ఈమె  నా భార్య సావిత్రి అన్నాడు శంకరం. ఇద్దరూ నా శిష్యులే కదరా. ఏంటి ఇలా వచ్చారు? అంటూ ఏమే పిల్లలొచ్చారు కాఫీ తే అని కేకేసారు.

మాష్టారూ,మీరు అమ్మగారిని ఏమే ఒసేయ్ కాఫీ,ఒసేయ్ ఏమే కాఫీ అని మాటిమాటికీ పిలిచేవారండీ అని సావిత్రి అంటే ,మీకు ఇంకా గుర్తుందా?మా మనవరాలు తాతగారు మామ్మని ఎలా పిలుస్తారంటే ఏమే ఒసేయ్ అంటారని చెపుతుంది అంటూ కాఫీ తెచ్చారు అమ్మగారు.

చుట్టూ పండ్లచెట్లూ,పూలమొక్కలు,గోశాల మధ్యలో ఇల్లు వానప్రస్థమా మాష్టారూ అంది సావిత్రి.

రిటైర్ అయ్యేవరకూ ఉదయం 6కి ప్రైవేటుతో మొదలుపెట్టి, 9కి స్కూలు, మళ్ళీ సాయంత్రం 5 నుంచి రాత్రి 8 వరకూ ప్రైవేటు.  భగవంతుడికి సమయం ఇవ్వలేదు నేను. ఇప్పుడు ప్రశాంతంగా దైవధ్యానంతో గడపాలిరా అంటే మాశ్రీను ఇలా ఊరికి కొంచెం దూరంగా కట్టించాడు ఇల్లు అన్నారు మాష్టారు.

చాలా నీరసంగా ఉన్నారు మీరు అని శంకరం అంటే తిండి అస్సలు తినరు ,ఇదిగో ఈ కాఫీలే కడుపు నింపుతాయి అన్నారు అమ్మగారు.

మధ్యాహ్నం మొదటి పీరియడ్ లెక్కలురా.
కడుపునిండా అన్నం తింటే నిద్ర వస్తుంది.మాష్టారు నిద్రపోతున్నారంటే చిన్నతనం కదా.అందుకని అప్పుడు కడుపు కట్టేసుకుంటే ఇప్పుడు తింటే పడడం లేదు అన్నారు మాష్టారు.

మాష్టారు మీ ఇంటి గురించి విని మీ దగ్గర చదివిన పిల్లలం కార్తీకమాసం వన భోజనం మీ ఇంటి దగ్గరే జరుపుకోవాలని గేటు ముందర ఖాళీ జాగాలో టెంట్ వేసాం చూడండి అంది సావిత్రి.  ఉదయం టెంట్ చూసి ఏదైనా ఫంక్షన్ ఏమో అనుకున్నాను మీరే ఏర్పటు చేసారా అన్నారు మాష్టారు సంబరంగా.

అవును మాష్టారూ మిమ్మల్ని పిలవడానికే మేము వచ్చాం.ఇవాళ మీ టిఫిన్లు,భోజనాలూ మీరందరూ మాతో చెయ్యాలి అన్నాడు శంకరం.

కుటుంబాలతో వచ్చిన శిష్యగణాన్ని చూసి మాష్టారు చాలా సంతోషించారు.మా పిల్లలకి 4మంచి మాటలు చెప్పండన్న శిష్యులతో ఇలా అన్నారు.మీరు విద్యని అర్ధించి నేర్చకున్నారు.మీ పిల్లలు విద్యని కొనుక్కుంటున్నారురా. వాళ్ళకి విలువలు నేర్పడం లేదు. అందుకే గౌరవమర్యాదలు లేకుండా ఉంటున్నారు. ఇప్పుడు ఎంతమంది అడిగినా నేను ట్యూషన్లు చెప్పనన్నది అందుకే.

పిల్లలకి మంచి నీతికథలు చెప్పండి. మంచి విలువలతో పిల్లలని పెంచండి. దేశానికి మంచి పౌరులను ఇవ్వండి అన్నారు మాష్టారు. అలాగేనని మాట ఇచ్చి మాష్టారి దగ్గర సెలవు తీసుకొని వెళుతున్న శిష్యులను చెమర్చిన కళ్ళతో చూస్తుండిపోయారు మాష్టారు.


ఈ కథ మా మాష్టారిదే.అలాంటి ఉపాధ్యాయలు కలకాలం ఉండాలని కోరుకుంటూ

==== ఫై కధలన్నీ సేకరించినవి=====

No comments:

Post a Comment

KNOWLEDGE ABOUT TAX PAYMENT

GVMC WEBSITE gvmc.gov.in

GVMC relaunch its website gvmc.gov.in ON 10-11-2018 please visit the site and offer remarks GVMC introduced Apartments association regi...