తెలుగు పద్యములు / కవితలు /పాటలు

ఈ క్రింద పద్యములు కవితలు అన్నీ నా స్నేహితురాలు శ్రీమతి రేగులగెడ్డ వెంకట లక్ష్మీ గాయత్రి చే వ్రాయబడినవి  

పద్యము – 1

బాటసారికి తోడు వచ్చు సీసా ఒకటి
జబ్బు చేసినవాడు వాడు సీసా ఒకటి
కొవ్వు బలిసినవాడు కోరు సీసా ఒకటి
సీస పద్యమ్మిది సీసాలపైన



పద్యము – 2

ఊయలలో పాపను ఊపి నిద్రపుచ్చి
ఇంటి పనులను తల్లి చేయుచుండంగా
ఉలికిపడిన బిడ్డ నూరడింప తల్లిపాడిన స్వరములు లేని
గీతములు శ్రావ్యములైనవి లోకులెన్నగన్


పద్యము - 3

బంగారము వంటి బాల్యమున
ఆడుతూ పాడుతూ విద్యలనునేర్చిన
ప్లాటినముకున్న విలువను
నీకిచ్చును ఈ లోకము యవ్వనమందున్
ఆపై సాధించిన ఘనతలతో
వృద్ధాప్యము వెలిగిపోవు వజ్రమువోలె

పద్యము - 4

బంధువులనాదరింపక
బంధాలను విడిచిపెట్టి
బంగారుమేడ లోపల
బందీగా బ్రతకవద్దు నువు గాయత్రీ

పద్యము - 5
అహం ఎంత శక్తిమంతమో
పదితలల రావణుడిని
వేయిచేతుల కార్తవీర్యుని
నట్టేటను ముంచె తాను కద గాయత్రీ

పద్యము-6

మూడడుగుల నేల కోరగ
కుంచించుకు శ్రీహరి తా వామనుడాయెన్
యాచించకు నీవెన్నడు
నీకున్నదె నీకు చాలు విను గాయత్రీ

పద్యము -7

కొలిమిని ఎర్రగ కాలి
కమ్మరి దెబ్బలకోర్చిన
బంగారము  విలువ పెరుగ
ఆభరణంబై
 చదువులు చక్కగ చదివి
విసుగు లేక శ్రమియించిన
బాలలు మెరిసెదరిలను
బంగారంబై

పద్యము -8
అణువుల అమరకవల్లనె
కర్బనముకు రూపుమారు
ఒక అమరిక వజ్రంబగు
ఒక అమరిక బొగ్గవును
 చదివిన చదువులు తమకు
చక్కగ అమరినవారలు
 వజ్రమువలె వెలిగేరు
చదువుకు విలువను ఈయక
చెడు దారిన తిరుగువారు
బొగ్గురీతిన బ్రతుకు బుగ్గి పాలౌదురు


పద్యం - 9 (డాక్టర్స్ డే  జూలై 1 స్పెషల్)

శిశువులకు ప్రాణంపోసే బ్రహ్మగా
రోగుల జీవితాన్ని నిలబెట్టే విష్ణువుగా
రోగాలని నిర్మూలించే (లయించే) శివునిగా
వైద్యో నారాయణో హరి అనిపించుకునే
వైద్యులందరికీ శతకోటి వందనములు

ధనమాశించక వైద్యం చేసి
ధరణిలో దేముడవీవని
ధన్వంతరి వంటి వాడవని పేరొందగా
ధన్యము కదా నీదు జన్మ

పద్యము -10

ఇంద్ర భవనంలాంటి ఇల్లు నీకున్ననూ
నీ మనసు ఇరుకుగా ఉన్ననాడు
నిలువ లేరెవ్వరూ నీ ఇంటి లోపల
తెలుసుకొని ప్రేమతో మెలగు గాయత్రీ!

పద్యము -11
దుర్యోధనుని ఇంట విందునే కాదని 
విదురునింటనే చేరే విష్ణుమూర్తి
ప్రేమతో పెట్టిన గంజి ఐనా అమృతమే

ఆదరిస్తూ కడుపు నింపు గాయత్రీ !

పద్యము -12

నాలుక చాలా చెడ్డది నట్టేటను ముంచుతుంది
రుచులన్నీకోరుతూ రోగాలను తెస్తుంది
ఆలోచించక వాగి అనర్ధాలు తెస్తుంది
నాలుకనెప్పుడు అదుపులో వుంచు గాయత్రీ

పద్యము -13
భగవంతుని నిందించుచు
భాగవతులను అపహస్యము చేయుచూ
పాపము మూట కట్టుకొను దురా
చారున్ దూరమున నుంచ సౌఖ్యం బబ్బు న్

పద్యము -14

తిన్నది అరిగించుకొను
జీర్ణశక్తి లేనివాడు
ఎంతగా ఇష్టమైననూ ఉలవ
చారున్ దూరమున నుంచ సౌఖ్యంబబ్బున్

పద్యము -15
కడుపున పుట్టిన శిశువుని ఒడి నిడుకొని 
కమ్మని పాలు కుడుపుచూ నడుమ
 వంట చేయు అతి వ ఒడుపును చూచి 
మెచ్చను వాడుండునా ఈ భువిలోనన్

పద్యము -16
రథసారథియై కృష్ణుడు
సుపథమ్మును చూపె కిరీటికి
యథాశక్తి కృషి చేసెదననిన
తథాస్తనుచు గెలిపించెను కురు సంగ్రామం

పద్యము -17
పథమును చేయుటెట్లని సంద్రమున
మథనము చెందిన రాముని
యథాశక్తి కృషి చేయుచు 
వారథి నిర్మింతుమనిరి వానరులంతా

పద్యము -18
తాళికట్టిన నాటినుంచి
తోడునీడగా వెంట నిలచి
కష్ట సుఖములు కలిసి పొందిన నిజ
కాంత కై తపింతురు వార్ధక్యమున గాదె

పద్యము -19
విప్రునిచే కబురంపగ
వచ్చిన కృష్ణుడు పాణిగ్రహణము
చేసిన రుక్మిణి కర
కమలము కలిసిపోయెను కరములందు

పద్యము -20
వైశాఖమాసమున వేడిగాడ్పుల మొదలు
మండుటెండలలోన మసలలేక
ఉస్సురంటున్న జనులకు నైఋతి ఋతు
పవనమునన్ లభించు ఘన సుఖంబు

పద్యము -21
అన్న వీపు నెక్కి ఆటలాడుచున్న
నల్లనయ్య శిరము పైన చేరి
నా పింఛమెంత పుణ్యమ్ము చేసె నని
మురియుచున్నది కదా వన మయూరి


పద్యము -22
వనములలోని వృక్షముల గాలియు నీడయు
నేలనూతిలోని నిర్మల జలమును
తరువులనుంచి తెచ్చిన తియ్యని ఫలములు పొందగ
వనమునన్ లభించు ఘన సుఖంబు


పద్యము -23
కంద పద్యమ్మన్న కందునే నా మోము
సీస పద్యమ్మనిన శ్వాస రాదు
ఆటవెలది అడగవలదు ఎప్పుడు నన్ను
ఇక చంపకమాల,ఉత్పలమాల
అడిగి చంపుటేల
పదాలు కూర్చి వరుసగ పేర్చి రాయటమే తెలుసు
భాషపైన నాకున్న మక్కువను
చేయకండి అలుసు


పద్యము -24
కొమ్మలను విరగకాసిన
దానిమ్మల కోసుకొచ్చి భక్తి మీరగన్
అమ్మా పండ్లను చేకొమ్మా
యని భక్తుడిచ్చె జగన్మాతకున్


పద్యము -25
ఆంగ్లము బాగా వచ్చని ధీమాతో
కామా సరిగా పెట్టకున్న
అర్థమ్మే మారి నిన్ను ఏమార్చునని
మామ చెప్పె మాకు కథ రూపంలో


పద్యము -26
మామా యుద్ధము గెలువగ లేమా
అని పలికిన అల్లుని మాటలతో ఏమార్చి
ధీమాగా వుండు విజయము మనదేనని
కొంప ముంచెగ శకుని మామ


పద్యము -27
సరిసరి నాపని సరని నే నన
పద పద మని మరిమరి రాసిన
పదమే పద్య మౌనని పద మని
నిన్నేమనెదనే నమనమిదే

పద్యము -28

కరకర లాడు కాకరకాయ వేపుడు
వేడి వేడిగా తినమంటోంది మూకుడు
చూసినవాడు తినకుండా ఆగడు
చేదేలేవని ఆపడు తిన్నాక వేలు నాకుడు

పద్యము -29
భావుకలోని భావుకలకు గాయత్రి నమస్కారము
నా స్నేహితురాలు పంపిన నా రాతలను చేయక తిరస్కారము
ఆదరించి అభిమానించుట మీ సంస్కారము
నాలాంటివారికి రాయడానికి ఇస్తుంది అది ఆస్కారము
మీ అభినందనలే నాకు ఇచ్చిన పురస్కారము
పద్యము -30
శత్రువులనెల్ల దునుమాడి
రణరంగమున గెలిచి విజయ
గర్వముతో ముంగిట నిలచిన రాజశేఖరముఁ

 గౌఁగలించి కాంత మురిసె

పద్యము -31
చీరలు సారెలు తెమ్మని అడిగిన
పడతికి మారాడక ముచ్చట తీర్చి
ఎల్లప్పుడు తన మాటకు ఊ కొట్టెడు
పతి నిష్టపడరె కోమలు లెల్లన్


పద్యము -32

పైసాయే పరమాత్మని భావించుట 
తప్పని తెలిసికొని
తలిదండ్రుల సేవ కొరకు పర 
దేశమ్మును వీడి చన నదృష్టమూ గల్గున్
పద్యము -33
మాతా పితరుల సేవయు
మాతృభూమి రుణము తీర్చుటె
పరమార్థమని తలచి పర
దేశమ్మును వీడి చన నదృష్టము గల్గున్
పద్యము -34
సమస్యాపూరణ సేయదలంచి
ఆలోచనలో మునిగిన సందర్భములో
ఘుమఘుమలాడు యాలకుల కమ్మని
టీ వలన కవిత్వమే విలసిలు
పద్యము -35
శాపవశమ్మున పుట్టిరి జయవిజయులు
రావణ కుంభకర్ణులై రాక్షస గర్భమ్మున
రఘురాముడు పుట్టెన్ వారల చంపి
శాపము తీ ర్పగ రఘువంశమునన్
పద్యము -36
ఏకైక అల్లుడని గారము చేసిన
యాతడు దశమగ్రహమై
సౌధమ్ము కాన్కగా నిమ్మని

హజారు మారులడిగెన్

పద్యము -37
ఏకైక సఖుడు కృష్ణుడు
దశదిశలా వ్యాపంపగ విజయుని కీర్తిన్
సౌఖ్యముగా రథము నడిపె

హజారు కరోడుల సేన కూల్చగన్

పద్యము -38
కొలనులోపల నిండి
కలియదిరుగుతు నుండు మీనముల
ఒంటికాల నిలచి దొంగ జపము చేయు
బకమె చాలుఁగొనగఁబ్రాణములను
పద్యము -39
భగవంతుని చూపే గురువు ఎవరని వెతికాడు నరేంద్రనాధ్ దత్తుడు
భగవంతుని చూపుతానన్న రామకృష్ణునికి అ యి నాడు భక్తుడు
రామకృష్ణపరమహంస సాన్ని హిత్యముతో నెమ్మదిగా  అయినాడు అతనికి దత్తుడు
భారతదేశ ఔన్నత్యాన్ని దశదిశలా చాటినాడు ఆ అపర శక్తిమంతుడు
అతడే అతడే మన వివేకానందుడు
పద్యము -40

*"సీతాపతి యనఁగఁ జంద్రశేఖరుఁడు గదా"*
వారధి దాటి లంక చేరవలె తొలుత ప్రార్ధింతుము
సర్వేశ్వరుని సర్వము సిధ్ధము చేయుము లక్ష్మణాయని
సీతాపతి యనఁగఁ చంద్రశేఖరుడు గదా యనిన లక్ష్మణుడు
పాలను,జలమును,భస్మము ,బిల్వమును పూజకమర్చెన్

పద్యము -41
*కల్లు, సార, బీరు,రమ్ము*
అనే పదాలు నాలుగు పాదాలలో ప్రయోగిస్తూ
చిలకల్లు వచ్చిచేరెను పండ్లను తినగా 
రమ్ము కాంచుమనుచును తోటకు
కబీరు తన మనుమల బిలువన్
మనసార కాంచి మనుమల మనసుప్పొంగెన్
పద్యము -42
చదువుతో పాటుగా సంస్కారమును నేర్పి
మంచిగా బ్రతికేటి దారి చూపి
విశ్వమానవ ప్రేమ తెలియచేసిన వారలని
మ్రొక్కఁగ నొప్పుఁబ్రేమికుల రోజూన నొజ్జల పాద పద్మముల్
పద్యము -43
భక్తజనులందరు కడుభక్తితో వేచియుండ
మేళతాళాలతో అర్చకులు వెంటరాగ
సీతను పరిణయమాడ శ్రీరామనవమినాడు రామ
చంద్రుఁడేతెంచె మధ్యాహ్న సమయమందు

పద్యము -44
బోయవాని చూసి భయపడి దాక్కున్న
శుకమునకు మృగరాజూ అభయమిడగ
మనసులేని మనుషుల చేత చిక్కుట కన్న నిదె మేలని
సింగము నోటన్ వసించెఁజిలుక ముదంబునన్

పద్యము -45
శివునకు కేశవునకు భేదము లేదనుచు
కార్తీకమందు కొలిచెదమిద్దరిని కడు భక్తి తోడన్
రామ భజన సేయుము శివరాత్రికి భక్తిన్
హరి హరులిద్దరికి ప్రీతి యొనర్పగన్
పద్యము -45
సిరికిన్ చెప్పడు పద్యం ఉంది కదా.
ఆ పద్యమును స్పూర్తిగా తీసుకుని కరి,సిరి హరి పరి పదాలతో క్రింది పద్యం 
కరి మొర విని వెడలెను హరి
సిరికిన్ చెప్పక వేగిర
ఏగెను హరి పరివారము, శంఖు చక్రాదులతో
హరివద్దకు మకరిని సంరక్షింపంగా
పద్యము -46
వనము పై మక్కువ కలిగి
పట్టు సాధించెదమను కోర్కె తోడ
భాషాశాస్త్రమును ఔపాసన పట్టిన ఘనాపా
టీతో వచ్చు కవిత్వ సంపదకుపోటీ లేదు ముమ్మాటికిన్
పద్యము -47
మంచిమాటలనెంచి మాలగా కూర్చుకొని
పదిమందికీ చెప్పదలచినపుడు
జంకుగొంకూ లేక కలము చేకొని వ్రాయు
పద్యములలోన యతులేల ప్రాసలేల
పద్యము -48
కార్యేషు దాసి కరణేషు మంత్రియని
కులధర్మపత్ని లక్షణములను తల్లినోట విని
మెట్టినింటను చేరి ధర్మా
చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్
పద్యము -49
తల్లి తన ఒడిలోన కూర్చండబెట్టుకొని
తనయునికి మాటలు నేర్పుచుండంగ
తండ్రి రాకను చూసి పసివాడు పలికెనిటుల
నాన నాన నాన ననన నాన
పద్యము -50
అడిగిన ఐదూళ్ళివ్వక కయ్యమునకు
కాలుదువ్విన దుర్యోధనాదుల జూచి
సభలో కొలువైన సజ్జనులంతా
మూడును మూడు మూడుననె మూర్ఖుల చిత్తము నొచ్చునట్లుగన్
పద్యము -51
కర కర లాడే కజ్జికాయలు,అరిసెలు రుచి
కరముగ అత్త చేయ అల్లుని కొరకై మ
కర సంక్రాంతికి వచ్చినల్లుడు ప్రీతి
కరముగ విందారగించి అత్తను పొగిడెన్
పద్యము -52
సాలుకు పన్నెండునెలలు
ఖరీఫ్ ,రబి యను పంటలు సాలుకు రెండే
వర్షాభావము చేతను పన్నెండునరెండువోవఫలితముసున్నే
పద్యము -53
తోటమాలి నీరు తొందరపడి పోయ
వేరు కుళ్ళి మొక్క నేలకొరుగు
వేచి ఉండవలెను వేగముగా రాదేదియు
సమయమొచ్చినపుడు ఆగదు ఏదీ
పద్యము -54
అశోకవనమున దుఃఖితయై ఉన్న
సీతమ్మ సమ్మతిని రావణుడు కోరగా
తృణము కన్న రావణుడే హీనమని లంకా
పతిని త్యజియంచి సతి పతవ్రత యనబడె
పద్యము -55
దాపున లేదు కడు దూరము
ఏగుటెట్లని యోచించంగా
చింతే లేదు ఎయిరు బస్సే
సాధనము గద దుబాయినిఁ జేరన్
పద్యము -56


మూర్ఛిల్లిన లక్ష్మణుని చూసి శోకార్తుడై
సంజీవని పర్వతమునందున్న
మూలికలతో
స్పృహవచ్చునని విని మనసారా 

తెమ్మనెను రామచంద్రుఁడు హనుమన్


పద్యము -57
ఎంత పుణ్యము చేసినారో తెలుగువారు
పంచారామములందు హరుఁడు గౌరితో వెలసె
సింహాచలమునతో కలిపి నవనారసింహ క్షేత్రములందు

వెలసె లక్ష్మీమనోహరుడు నరసింహ రూపుడై

పద్యము -58
ధర్మము కాదు వనితనపహరించి కొనిపోవుట
యని నీతి చెప్పుచు నిలిచి యడ్డగించి
రావణుతో పోరాడి రెక్కలు తెగి కూలిన
సంపాతిని అల్పుఁజెప్పనగు మహాత్ముఁడనుచు

కవిత - 1

చీకటి నుంచి వెలుగు లోకి నడిపించే వాడే గురువని
పెద్దలు చెప్పారానాడు
మృత్యువు నుంచి తప్పించి
బ్రతుకును ఇచ్చేవాడే గురువని
రుజువయ్యంది ఈ నాడు
చీకటి గుహలలో ధైర్యం చెప్పి
మృత్యుంజయులుగ శిష్యులచేసి
బయటకు తెచ్చాడొక గురువు
కోమానుండి తన మాటలతో
ధీమాగా శిష్యుని బయటకు

తెచ్చాడొక గురువు

అందుకే గురు బ్రహ్మ 

గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః

గురుసాక్షాత్ పరబ్రహ్మ

అంటూ వారిని కొలిచేది

అందుకే

మన గురువులకిదే వందనం

మీపలుకే మాకింధనం

(మాకు ఇంధనం అని)



కవిత - 2  (స్త్రీ)

కోపములో సూర్యుని వేడి
శాంతములో వెన్నెల చల్లదనము
ఔన్నత్యములో మేరు వంత ఎత్తు
ఆoతర్యము చూస్తే మెరీనా అగాధము
చూపిస్తుంది సముద్రమంత గాoభీర్యము
భరిస్తుంది భూదేవిలా సహనముతో
రక్తాన్ని స్తన్యం చేసిఅందించే కర్తగా
శరీరాన్ని చీల్చి బిడ్డకు జన్మనిచ్చే సృష్టికర్తగా
త్యాగమయి తను అందరికోసం
స్వార్ధము వుంటే అది తన పిల్లలకోసం
స్త్రీ అనేది ఒక సంశ్లేష అక్షరం
బ్రహ్మ కూడా విస్తుపోయే సంక్లిష్ట అక్షరం

కవిత - 3

తెలుగు భాష ప్రాముఖ్యత

చెయ్యెత్తి  జై  కొట్టు తెలుగోడా
తెలుగు భాషా నిధిని  కలవాడా

నన్నయ్య, తిక్కన, ఎఱ్ఱన కవులు భారతము రాసినిది మన తెలుగులోనే
వేమన, బద్దెన, మారెన, గోపన శతకములు రాసినది మన తెలుగులోనే

బాపు రమణల బుడుగు, నండూరి ఎంకి ముచ్చట్లు చెప్పినది మన తెలుగులోనే
పంచతంత్రములోని నీతి కధలన్నీ పరవస్తు చిన్నయ్య చక్కగా రాసి చదవమని ఇచ్చింది మన తెలుగులోనే

ఆరుద్ర, ఆత్రేయ, వేటూరి, సినారె, దాశరధి రాసిన పాటలకు మెచ్చి చలన చిత్రములన్నియు బహు ఖ్యాతి పొందినది మన తెలుగులోనే
పోతన భాగవతం, అన్నమయ్య కీర్తనలు, మొల్ల రామాయణం రాసినది మన తెలుగులోనే

తెలుగు సాహిత్యమే మన నిధి
మన ముందు తరాలకు అదే పెన్నిధి 

చెయ్యెత్తి  జై  కొట్టు తెలుగోడా
తెలుగు భాషా నిధిని కలవాడా


కవిత - 4
గురజాడ వారి జయంతి సందర్భము గా   (సెప్టెంబర్ 21) 

గురజాడ వారి ముత్యాల సరాలు
తెలుగు జాతి కి ఇచ్చిన గొప్ప వరాలు

గురజాడ వారి కన్యాశుల్కం ఎప్పుడు ప్రదర్శించినా
జనం చెబుతారు వెల్కమ్

అగ్నిహోత్రావధానుల కోపం
బుచ్చమ్మ పాలిట శాపం

గిరీశం వేసిన టీచర్ వేషం
వెంకటేశం చేస్తాడు తండ్రిని మోసం

రామప్ప పంతులి వ్యవహార లౌక్యం
మధురవాణి చేయక తప్పలేదు జోక్యం

లుబ్ధావధానుల పీనాసితనం
పూటకూల్లెమ్మ నోటి దురుసుతనం

ఇలా నాటకం లో ప్రతి పాత్ర లోనూ
మమకారం అహంకారం వెటకారం
సందర్భోచితంగా ధరిస్తాయి ఆకారం

నవరసాల తోటి నింపి రాసిన నాటకం  కన్యాశుల్కం 

నవలా జగత్తులో ధ్రువ తారగా వెలసిన
గురజాడ వారికి జన్మదిన శుభాకాంక్షలు


కవిత - 5 (children's day NOVEMBER 14 Special)

నేటి బాలలే రేపటి పౌరులని 
భావి భారత భాగ్య విధాతలని
విద్యా బుద్ధులు మంచిగ నేర్చి
మంచి  విలువలను మాలగా కూర్చి
భవిష్యత్తు కే మెట్లను పేర్చి
ఒక్కొమెట్టు ఎక్కాలి

తోటివారికి సాయం చేసి
స్వార్ధాన్ని మటుమాయం చేసి
చెడు అలవాట్లను దూరం చేసి
చక్కని పౌరులు కావాలి

టీవీ లంటూ సెల్ల్ఫోన్స్ అంటూ
సినిమా లంటూ సెల్ఫీలంటూ
సమయాన్ని వృధా చేయమంటూ
మీరు ప్రతిఙ్ఞ ను పూ నాలి

ఆటలు పాటలు వ్యాయా మాలతో
శారీరక శ్రమ చేయాలి


భరతమాత కు ముద్దుబిడ్డలు మీరే మీరే కావాలి

కవిత - 6
కిల కిల మంటూ పిల్లల నవ్వులు 
గల గల సాగే వారి మాటలు
మిలమిల మెరిసే వారి కన్నులు
చూడాలంటే ముచ్చటలే

చక చక మంటూ ఉరుకులు పరుగులు
రక రకాలు గా వేసిన దుస్తులు
తిక మక పెట్టె వారి ఆటలు
చూడాలంటె ముచ్చటలే

ఆడి ఓడిన పిల్లల ఏడుపులు
గెలిచి నిలచిన పిల్ల నవ్వులు
అన్ని మరిచి మరల ఆడగా

చూడాలంటే ముచ్చటలే

కవిత - 7

ఒక మౌనం శాంతి నిస్తుంది
ఒక మౌనం అంగీకారం తెలుపుతుంది
ఒక మౌనం తరువాత వచ్చే యుద్ధాన్ని తెలుపుతుంది
ఈ మౌనం లో ఏ ముందో

మౌనం గా ఉంటే పో లే!

కవిత - 8

నీ కళ్ళే కలు వల రేకులనీ
నీ నాసిక యే సంపెంగ యనీ
నీ చెవులు చామంతి పువ్వులనీ
మందార మంటి ది నీ మోముయనీ
నిన్ను చూడగానే అనుకున్నాను
నా మనసు పారేసు కున్నాను
నీ కురులలోన నే పువ్వు  నై
నీ అధర ము పై చిరునవ్వు నై
నిన్నంటి పెట్టుకుని ఉండాలని
నీతోనే జీవితం పండా లని
నీ ప్రేమనే నే కోరుకున్నాను
చామంతులతో చెలిమే చేసి
పూబంతులను బతిమా లా ను
నా ఇంతి ని చెంతకు తెచ్చుటె లాగని
మంత నాలనే జరిపాను
పొన్నాలు పొగడలు పారి జాతలతో పుష్పా భిషేకం చేయాలని
అది చూసి నీ కళ్ళు మెర వా లనీ
నీ మన సు మురవాలనీ
నా ప్రేమ వెంటనే గెలవాలని
నీ తోటకు పరుగులు తీ సాను
పుష్ప విలా పము చదివిన నేను
పువ్వులే కోయలేను
నే ల రాలిన పువ్వులను 
నేర్పుగ ఓర్పుగ ఏరి తెచ్చాను
నా రమణీ మణి ముందు పరచాను
నీ ప్రేమ పువ్వులా సున్నితమంటూ
నీ చెలిమి నాకు సమ్మతమంటూ
నీ తొడునీడగా ఉంటా నంటూ
నా చెలి పలికిన పలుకులు వింటూ 
నన్ను నే మరచిపోయాను
నా కలల రాణినే గెలిచాను

కవిత - 9
కమ్మనైన తెలుగు భాష
అమ్మ కదా తెలుగు భాష
అందమైన తెలుగు భాష
అంతటను వెలుగు భాష

తెలుగు జాతి మనది
నిండుగా వెలుగు జాతి మనది
వచ్చిండన్నా వచ్చాడ న్నా
వరాల తెలుగు ఒకటేనన్నా
అన్నారు మన సి.నా.రె.
మా తెలుగుతల్లికి మల్లెపూదండ
మా కన్నా తల్లికి మంగళారతులు
అని కీర్తించినారు మన సుందరాచారి
చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా
గతమెంతో ఘనకీర్తి కలవాడా
అని జై కొట్టినారు మన వేములపల్లి శ్రీ కృష్ణ
భారతాన్ని తెనుగించిన కవిత్రయం
నన్నయ్య, తిక్కన,ఎఱ్ఱన
భాగవతం తెనుగించిన బమ్మెర పోతన
పదకవితా పితామహుడు అన్నమయ్య
వాగ్గేయకారుడు మన త్యాగయ్య
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు
వీరేశలింగం గారు రాసిన వ్యాసాలు
గురజాడ వారు రాసిన నాటకాలు
కృష్ణశాస్త్రి గారి ఖండకావ్యాలు
దాశరధి కురిపించె అగ్నిధారలు
నండూరి ఎంకిలో మధురభావాలు
మనని మురిపించినది మన తెలుగులోనే
అగ్గిపుల్ల,కుక్కపిల్ల,సబ్బుబిళ్ళ
కాదేదీ కవితకనర్హం అని అంటూ
పదండి ముందుకు పదండి తోసుకు
పదండి పోదాం పైపైకి
అని నడిపించారు శ్రీశ్రీ
తెలుగులోనే ఉన్నవి 56అక్షరాలు
పేర్చుకుంటు నువుపోతే పలికించును నవరసాలు
దేశభాషలందు తెలుగు లెస్స అని
నేను తెలుగు వల్లభుడననేగా శ్రీకృష్ణదేవరాయలు
అంబా అంటూ అరిచే గోమాత కూడా
తెలుగు భాష లోని గొప్ప చెపుతూ ఉంటే
అమ్మ అను పిలుపులోన ఆర్ద్రత లేదా
అమ్మ భాష అంటే మనకు అంత చేదా
పరభాషా జ్ఞానాన్ని తప్పక కలిగుండాలి
మాతృభాష గొప్పదనం మరువక నీవుండాలి
ఎన్ని భాషలు నువు నేర్చిన గాని
తెలుగులోనే నువ్వు మాట్లాడుతూ ఉండాలి
మాతృభాషా దినోత్సవం సందర్భంగా
శ్రీమతి వెంకట లక్ష్మీ గాయత్రి రేగులగెడ్డ రచన

కవిత - 10


కల్పనా chawla కు కవితాంజలి
17 మార్చ్ 1962 -- 01 ఫిబ్రవరి 2003
ఆకాశానికి నిచ్చెనవేసి ఆనందంగా నింగికి ఎగసి
అక్కడ ప్రయోగాలనే చేసి
విజయంతో తిరిగొచ్చేసి
నింగి నాకూ స్నేహం అంటూ
వ్యోమనౌక తిరిగెక్కేసి
కిందకి వచ్చేస్తున్నావంటూ
అందరూ ఆశగ చూసేవేళ
వ్యోమనౌకే పేలగా
శకలాల్లో శకలమయ్యావు
మా మనసంతా వికలం చేసావు
చుక్కల్లో చుక్కవైపోయినా
ఓ కల్పనా నువు చావలా
మా మనసుల్లో బ్రతికే ఉన్నావు🙏



కవిత - 11

పూరి గుడిసె అయినా
మనసెరిగిన భర్త తోడుంటే
అది సువర్ణకుటీరమే
పసుపుకుంకుమలిచ్చి చల్లగాచూసిన
మాతల్లి మహలక్ష్మి స్వాగతము పలికేను
ముత్యాలముగ్గుతో అనుదినము నీకు
ముదిమి వయసున కూడ నిను మరువబోను
సుఖశాంతులనిచ్చి అనుగ్రహించమ్మా

కవిత - 12


పర్యావరణ దినం

ఇది పర్యావరణ దినం

పరిసరాల నొక్కసారి పరి

కించు ఈ దినం
చుట్టుపక్కల నిండి ఉంది చెత్తా చెదారం
దానిలోన కలిసి ఉంది ప్లాస్టిక్ వ్యర్ధం
అదే కలిగిస్తోంది మనకు అనర్ధం  "పర్యావరణ.దినం ఇది పర్యావరణ దినం"

 టీకోట్లో చూసినా,హోటళ్ళ లో చూసినా
ప్లాస్టిక్ కవర్లలో ప్యాకింగులు
చేతిసంచి పట్టికెళితే నామోషీ అనుకుంటూ
క్యారీబ్యాగులడిగి చేస్తాం షాపింగులు
మట్టికాలికంటితే ఛీఛీ బురద అంటూ
సిమెంటుతో పామించి గచ్చు చేసిపారేస్తాం
వర్షపునీరింకితేనే
భూగర్భజలమొచ్చుననే
విషయాన్నే మరిచిపోయి
రోజులనే గడిపేస్తాం
ఎండాకాలం వచ్చి బోరునీరు అడుగంటితే
ట్యాంకరుతో నీరు కోసం పరుగులే పెట్టేస్తాం
"పర్యావరణ దినం ఇది పర్యావరణ దినం"

మొక్కలు నాటాలంటే మొక్కబడిగ నాటేస్తాం
మరుసటిరోజుకి మొక్కనాటామని మరచిపోతాం
మంచి పనులు చేసేందుకు సమయం ఉండదు మనకు
సెల్ ఫోను ముచ్చట్లకు సమయం చాలదు మనకు
"పర్యావరణ దినం.ఇది పర్యావరణ.దినం"

మన పిల్లలు సుఖముగా ఉండాలంటే
భావిభారతం పచ్చగ ఎదగాలంటే
మనమంతా మొక్కలని పిల్లలవలె పెంచుదాం
పరిసరాల పరిశుభ్రత పాటించుదాం
ప్లాస్టిక్ రహిత జీవనాన్ని చేపడదాం
వాహనాల కాలుష్యం అరికడదాము
పచ్చని పాడీపంటతో పచ్చంగా బతుకుదాం



కవిత - 13

జాతిపితవు నీవని
జగమంతా చెప్పుకుని
జయంతంటు ఒకసారి
వర్ధంతని మరోసారి
నిన్ను మేమ తలుస్తాము
మరునాడే మరుస్తాము
 అహింసే మన ధర్మమని
ఒక చెంపన దెబ్బ వేస్తే 
మరో చెంప చూపమని
అతివాదమనర్ధమని
సత్యాగ్రహమే మేలని
ఆచరించి చూపావు
ఆచరించమన్నావు
అవకాశందొరికితే
ఆయుధాలు తీసేసి
బస్సులు తగలెట్టేసి
బందులనే చేసేసే
ఆ హింసని నువుచూస్తే
ఇదానేను కలలుకన్న
భారతదేశం అంటూ కన్నీరే కార్చేవు
మనసులు స్వచ్ఛం కాదు
మనుషులు స్వచ్ఛంకాదు
పరిసరాలు ప్లాస్టిక్ వ్యర్ధాలతో నిండి
అసలే స్వచ్ఛం కాదు
ఎలా ఎలా సాధ్యమౌను
స్వచ్ఛ భారతదేశం
ఏలోకంలో ఉన్నా ఓ పూజ్య బాపూ
మా తప్పులనే క్షమించు
మాలోపల మార్పువచ్చి
మంచివారిమవ్వాలని
మమ్మల్ని దీవించు


కవిత - 14


శ్రీ పంచమి సందర్భముగా సరస్వతీదేవి స్తుతి

జ్ఞానం దేహి స్మృతిం దేహి
విద్యాందేహి శారదాంబికే
హంసవాహినీ జ్ఞానప్రదాయిని
వరవీణా మృదుపాణివి నీవని శ్వేతవస్త్రవై శ్వేతాసనవై
మంచిమనసుతో మూఢులకైనా
జ్ఞానమునిచ్చే తల్లివి నీవని
శ్రీశారదాంబా నమోస్తుతే అని
అమ్మా నిన్నే కొలిచితిమి

పంచమీ పంచభూతేశీ 
పంచ సంఖ్యోపచారిణివంటూ
జగన్మాతగా నిన్నే కొలిచి
శరన్నవరాత్రి ఉత్సవాలలో
మూలానక్షత్రము కల రోజుని
పూజ చేసి నిను కొలిచితిమి

మాఘపంచమి పర్వదినాన
తెల్లని పువ్వులు పూజకు తెచ్చి
పుస్తకాలలో నిన్నే నిలిపి
శ్రీవాణీ చతుర్ముఖు రాణీ
నీకు పూజలే చేసితిమి
హవిష్యాన్నము,అటుకులను
నైవేద్యముగా పెట్టితిమి

గురుశాపముచే ఖేదమునొందిన
యాజ్ఞవల్క్యుడు నిన్ను కొలువగా
సంతసించి ఆతని కరుణించి
విద్యలనెన్నో ఒసగితివీవని
నీ కరుణకై నిను వేడితిమి


బై శ్రీమతి రేగులగెడ్డ వెంకట లక్ష్మీ గాయత్రి

All the above written by -  శ్రీమతి  రేగులగడ్డ వెంకట లక్ష్మీ                                                      గాయత్రి                     చోడవరం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్




SPECIAL WRITINGS (From all sources)

1)

సినిమా బావుండి ప్రేక్షకులకు నచ్చి థియేటర్లు నిండితే ఆ సినిమా బృందం హిట్ కొడతారు..
అదే సినిమా బాగోలేక ప్రేక్షకులకు నచ్చక థియేటర్లు ఖాళీగా ఉంటే ఆ థియేటర్ యజమానులు హిట్ కొడతారు.. (ఖాళీ థియేటర్ లో ఈగలు దోమలు బొద్దింక లు  తిరగకుండా)..
ఏది ఏమైనా హిట్ కామన్..
BY విజ్ఞాన్ కె

2)
ఎండిన ఆకులైతేనేం, పండిన కాయలైతేనేం !
అందంగా పేర్చితే...
జంతువుల్లానూ ఉంటాయి, పిట్టల్లానూ కనిపిస్తాయి !
పనికిరానిదేదీ లేదని చాటి చెప్తుంటాయి !

చదువైనా అంతే, బ్రతుకైనా అంతే !
తీర్చి దిద్దే గురువు దొరకాలే గానీ....
రాణింపు కు రారా, 
సమర్ధులని నిరూపించుకోరా !

పనికి రారని అనకూడదెవర్నీ !
ఏ రంగంలో పనికొస్తారో.....
ఎక్కడ రాణిస్తారో......
తెలిసి, దారి చూపాలి !
అప్పుడే " గురువు " అనే మాట
సార్ధక మవుతుంది !
------సేకరణ-----

3)

మహారాష్ట్ర మాణిక్యమై మెరిసినదీ సావిత్రి
తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా విరసినదీ పూలె
పూణేలో మొదటి బాలిక ల పాఠశాలను ఆరంభించి
మొత్తముగా పద్దెనిమిది పాఠశాలలను ప్రారంబించిందీ మహిళామణి సావిత్రి
కావ్య పూలెను రచించి భావన్ కాశి సుభోద రత్నా కరమును విరచించిందీ సావిత్రి
అంబేద్కర్ అన్నా బహుసాఠే సరసన నిలిచినదీ సావిత్రి
అల నాటి సావిత్రి పతి ప్రాణాల కోసం పోరాడి గెలిచింది
ఈ సావిత్రి పూలె ప్లేగ్ భాదితులకోసము పోరాడి మంచి మనుసులనే గెలిచి నిలచినది. 

No comments:

Post a Comment

KNOWLEDGE ABOUT TAX PAYMENT

GVMC WEBSITE gvmc.gov.in

GVMC relaunch its website gvmc.gov.in ON 10-11-2018 please visit the site and offer remarks GVMC introduced Apartments association regi...